సీఎంఆర్ బియ్యం అందజేయడంలో జాప్యం చేస్తున్న రైస్ మిల్లర్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోసారి గడువు పొడిగించాలని మిల్లర్లు ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేసినప్పటికీ సర్కార్ మాత్రం కుదరదని తేల్చి చెబుతున్నది. రెండేండ్లుగా పెండింగ్లో ఉన్న సీఎంఆర్ రైస్ను అందజేసేందుకుగాను గడువిచ్చినప్పటికీ నిర్ణీత గడువులోగా లెవీని అందజేయని మిల్లర్లపై ప్రభుత్వం పెనాల్టీ విధించింది.
వికారాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : లెవీ బియ్యం అందజేసేందుకుగాను మిల్లర్లకు డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చిన ప్రభుత్వం… రైస్ మిల్లర్ల విజ్ఞప్తి మేరకు జనవరి 31 వరకు గడువు పొడిగించింది. అయినా లేవీ బియ్యం అందజేయలేదు. సీఎంఆర్ రైస్ నిర్ణీత గడువులోగా ఇవ్వని 45 రైస్ మిల్లర్లకు బియ్యానికి బదులుగా డబ్బులు చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వానికి తిరిగివ్వాల్సిన లెవీ బియ్యానికి అదనంగా 25 శాతం మేర డబ్బులు చెల్లించేలా మిల్లర్లను ఆదేశించింది.
జిల్లావ్యాప్తంగా 45 రైస్ మిల్లర్ల నుంచి 20 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి మిల్లర్లు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం విధించిన గడువు ముగిసిన దృష్ట్యా కిలోకు రూ.35ల చొప్పున రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించనున్నారు. 20 వేల మెట్రిక్ టన్నులకు సంబంధించి రూ.70 కోట్లు అవుతుండగా, అదనంగా 25 శాతం డబ్బులు చెల్లించాలని పెనాల్టీ విధించిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వానికి మిల్లర్లు రూ.87 కోట్లను చెల్లించనున్నారు. అయితే పెనాల్టీతో సహా చెల్లించే డబ్బులు ఎప్పటిలోగా చెల్లించాలనేది కూడా ప్రభుత్వం గడువును నిర్ణయించనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వానకాలం ధాన్యానికి సంబంధించి ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ ద్వారా విక్రయించేందుకు నిర్ణయించింది.
జిల్లాలోని రైస్ మిల్లర్లు రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద పౌరసరఫరాల శాఖ ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి లెవీ అందించేందుకుగాను రైస్ మిల్లర్లకు ధాన్యాన్ని సరఫరా చేస్తుండగా, మిల్లర్లు ప్రభుత్వం అందించే ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తూ, నాసిరకం బియ్యం ఏడాది, ఏడాదిన్నర తర్వాత అందజేస్తూ వస్తున్నారు. కొందరు రైస్ మిల్లర్లు అయితే మరీ రెండేండ్లు దాటినా సీఎంఆర్ బియ్యం తిరిగివ్వని పరిస్థితులు ఉన్నాయి.
ప్రభుత్వం కొనుగోలు చేసి సరఫరా చేసే ధాన్యాన్ని బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్లో కిలో రూ.15లకుపైగా విక్రయిస్తూ, ప్రభుత్వానికి ఇవ్వాల్సిన లెవీ బియ్యానికి సంబంధించి రేషన్ దుకాణాల ద్వారా సరఫరా చేసే బియ్యాన్ని రూ.10లకు కిలో చొప్పున కొనుగోలు చేస్తూ రేషన్ బియ్యాన్ని లెవీ రూపంలో అందజేస్తున్న రేషన్ డీలర్లు అక్రమంగా సంపాదిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చే ధాన్యాన్ని బియ్యంగా మార్చి రూ.15లకుపైగా విక్రయిస్తూ, మిల్లర్లు రేషన్ బియ్యాన్ని రూ.10లకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి రూ.35లకు విక్రయించి కిలోకు రూ.30లకుపైగా అక్రమంగా సంపాదిస్తున్నారు.
ఈ విధంగా ప్రతీ సీజన్లో వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు లెవీకి అందజేస్తుంటే అధికారులతో కుమ్మక్కై నాసిరకం బియ్యం అందించి రూ.వందల కోట్లలో అక్రమాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ అక్రమ దందా అంతా తెలిసిన పౌరసరఫరాల అధికారులు మాత్రం మిల్లర్లతో కుమ్మక్కై ప్రభుత్వానికి రూ.కోట్లలో నష్టం కలుగజేస్తున్నారు.
రైస్మిల్లర్లపై ప్రత్యేక నిఘా లేకపోవడం, సీఎంఆర్ రైస్ ఇవ్వడంలో మిల్లర్లు జాప్యం చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ తతంగం జరుగుతుండడం గమనార్హం. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి బియ్యం రూపంలో పౌరసరఫరాల శాఖకు 15 రోజుల్లోగా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఒకరిద్దరు మిల్లర్లు మినహా అందరూ.. పౌరసరఫరాల శాఖ మిల్లింగ్కై ఇచ్చిన ధాన్యాన్ని వెంటనే బ్లాక్ మార్కెట్కు తరలించి ఎలాంటి అనుమానం రాకుండా విడుతల వారీగా పౌరసరఫరాల శాఖకు నాసిరకం బియ్యాన్ని అందజేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.