షాద్నగర్టౌన్, నవంబర్ 29 : గత ప్రభుత్వాల హయాంలో మున్సిపాలిటీలోని ప్రభుత్వ స్థలాలు చెత్తాచెదారం, కలుపు మొక్కలతో అస్తవ్యస్తంగా ఉండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే ప్రభుత్వ స్థలాల రూపురేఖలు మారిపోయాయి. మున్సిపాలిటీలోని 28వార్డుల్లో ప్రభుత్వ స్థలాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడంతో ప్రభుత్వ స్థలాలు సరికొత్త శోభను సంతరించుకుని ఆయా కాలనీవాసులకు కనువిందు చేస్తున్నాయి. కొన్ని కాలనీల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆహ్లాదకర వాతావరణాన్ని అందించే మొక్కలతో పాటు ఆక్సిజన్ను ఎక్కువగా అందించే మొక్కలు, కనువిందు చేసే పండ్ల, పూల మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తున్నారు. నేడు అవి సత్ఫలితాలనిస్తున్నాయి. అదే విధంగా కాలనీల్లోని పార్కుల్లో మొక్కలతో పాటు పాదచారులు వాకింగ్ చేసే విధంగా వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయడంతో పాటు సేదతీరేందుకు బెంచీలను అమర్చారు.
దీంతో కాలనీవాసులు పార్కుల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో వాకింగ్ చేస్తూ సేదతీరుతున్నారు. ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో షాద్నగర్ మున్సిపాలిటీలోని 18వ వార్డు భాగ్యనగర్కాలనీ పార్కు స్థలంలో ఆధునిక పరికరాలతో కూడిన ఓపెన్ జిమ్ను 2019లో ఏర్పాటు చేశారు. భాగ్యనగర్కాలనీలో 500గజాల స్థలంలో 14రకాల ఆధునిక పరికరాలతో కూడిన ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేయగా పార్కు చుట్టూ కంపౌండ్ వాల్ను మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది. దీంతో పాటు ఆహ్లాదాన్ని అందించే విధంగా పచ్చని మొక్కలను పెంచుతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యాయామం చేయడానికి చిన్నారుల నుంచి పెద్దల వరకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ప్రతి రోజూ వ్యాయామం చేస్తా
మా కాలనీలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్కు అనునిత్యం వెళ్లి వ్యాయామం చేస్తా. పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. కాలనీవాసులే కాకుండా ప్రజలు ఈ ఓపెన్ జిమ్ను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఓపెన్ జిమ్లో ధ్వంసమైన కొన్ని పరికరాలను బాగు చేయించాలి.
– శ్రీనివాస్, భాగ్యనగర్కాలనీ, షాద్నగర్
ఎంతో మంది వస్తున్నారు..
కాలనీలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను కాలనీవాసులతో పాటు ప్రజలు సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉంది. ప్రతి రోజూ ఎంతో మంది ఈ ఓపెన్ జిమ్లో వ్యాయామం చేస్తూ సేదతీరుతున్నారు. కాలనీవాసుల సహకారంతో మా వార్డును మరింత అభివృద్ధి చేస్తున్నా. పార్కులో నాటిన మొక్కలను సంరక్షిస్తున్నాం.
–ప్రేమలతాయుగేందర్, 18వ వార్డు కౌన్సిలర్ షాద్నగర్