సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్కు పాల్పడుతూ అమాయక ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న అంతర్జాతీయ ముఠా గుట్టును రట్టు చేశారు సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ 98.47లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఒక బాధితుడి ఫిర్యాదుతో ఈ ముఠా గుట్టు రట్టయింది. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ క్రైం డీసీపీ కల్మేశ్వర్, సైబర్ క్రైమ్స్ డీసీపీ రితిరాజ్ కేసు పూర్వాపరాలను వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన మోహిన్ పాషా, కరన్ అరోరా, సంజీవ్కుమార్, గోకుల్సింగ్ కొరంగ, దినేశ్సింగ్, న్యూ ఢిల్లీకి చెందిన కరన్ మల్హోత్రా, ఢిల్లీకి చెందిన సోనూ లోకేశ్, మోహిత్కుమార్ ఒక ముఠాగా ఏర్పడి నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా యువతను ఆకర్షించేందుకు గేమింగ్, బెట్టింగ్కు సంబంధించిన ప్రకటనలను వివిధ వెబ్సైట్ల ద్వారా, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ప్రచారం చేస్తారు. ఈ క్రమంలో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ ఆడేవారికి ముందుగా కొన్ని ఆటలు గెలిచినట్లు వెల్లడించి వారికి కొంత డబ్బు చెల్లించి నమ్మిస్తారు. ఈ క్రమంలో వినియోగదారులకు డబ్బు ఆశ చూపిస్తూ అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేలా వారిని మోసగించి వారి బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును కాజేస్తారు.
రైతు చేతుల కష్టం సేఫ్..
రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక రైతు తన భూమిని ప్రభుత్వానికి ఇవ్వగా.. అందుకు పరిహారంగా ప్రభుత్వం సదరు రైతుకు డబ్బులు చెల్లించింది. ఆ డబ్బును సదరు రైతు తన కుటుంబ సభ్యుల ఖాతాల్లో భద్రపరిచాడు. ఆన్లైన్ గేమింగ్కు అలవాటుపడిన సదరు రైతు కుమారుడు డిసెంబర్ 19న ఆన్లైన్ గేమింగ్ ద్వారా డబ్బులు కోల్పోయాడు. కష్టార్జితమంతా కోల్పోవడంతో ఆ రైతు కుటుంబానికి గుండె ఆగినంత పనైంది. బోరున విలపిస్తూ బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన సైబర్క్రైమ్ పోలీసులు దర్యాప్తు జరిపి ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. దీంతో రైతుకు సంబంధించిన డబ్బులు తిరిగి లభిస్తాయని పోలీసు వర్గాలు చెబుతుండడంతో సదరు రైతు గుండెల్లో ఆశలు చిగురించాయి.
లావాదేవీల కోసం మ్యూల్ బ్యాంక్ ఖాతాలు, సిమ్కార్డులు
నిందితులు అమాయక ప్రజల నుంచి దోచుకున్న డబ్బును విత్డ్రా చేసేందుకు మ్యూల్(ఇతరుల పేరుపై) బ్యాంకు ఖాతాలు, మ్యూల్ సిమ్కార్డులు వినియోగిస్తారు. మ్యూల్ ఖాతాల కోసం వారికి తెలిసిన నిరుపేద, అమాయకులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను సేకరించి వారి పేరున ఈ బ్యాంక్ ఖాతాలు, సిమ్కార్డులను పొందుతారు. అందులో కొంతమందికి కొంత కమీషన్ ఇవ్వగా మరికొంత మందికి తెలియకుండానే వారి వివరాలతో ఖాతాలు, సిమ్కార్డులు పొందుతారు. దీని వల్ల గేమింగ్ ఆడిన వారి ఖాతాల్లోని డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకి రాకుండా అది మ్యూల్ ఖాతాల్లోకి వస్తుంది. అక్కడి నుంచి వీరు డబ్బును విత్డ్రా చేస్తారు.
పట్టుబడ్డారిలా..
గత సంవత్సరం డిసెంబర్ 19న ఒక యువకుడు ఆన్లైన్ గేమ్ ఆడుతూ తన బ్యాంకు ఖాతాలోని రూ.44.26లక్షలు కోల్పోయాడు. తన తల్లి ఖాతాలో నుంచి మరింత డబ్బును.. ఈ క్రమంలో ఒకే రోజులో మొత్తం రూ.98,47,334లను కోల్పోయాడు. విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన సైబర్క్రైం విభాగంలో కేసు నమోదు చేసి ఎన్సీఆర్పి(నేషనల్ సైబర్క్రైం పోర్టల్)కి కూడా సమాచారం అందించారు. ఈమేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుల గుట్టు విప్పేందుకు సాంకేతిక విశ్లేషణ జరిపి ఢిల్లీ, ఉత్తర్రప్రదేశ్ వెళ్లి పూర్తి సమాచారాన్ని సేకరించారు.
ఆన్లైన్ గేమ్ల ద్వారా డబ్బులు డ్రా చేసిన దాదాపు 32 వేర్వేరు బ్యాంకులకు చెందిన ఖాతాలను గుర్తించి 41కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేశారు. అనంతరం ఎనిమిది మంది నిందితులను ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో అదుపులోకి తీసుకుని, నగరానికి తరలించారు. నిందితుల నుంచి 193 సెల్ఫోన్స్, 21ల్యాప్టాప్స్, 21 పాయింట్ ఆఫ్ సేల్ డివైజ్, 416 చెక్ బుక్కులు, 233 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీధర్, ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్, ఎస్ఐ బి.సందీప్ తదితరులను సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు. డబ్బులు పోయిన వెంటనే టోల్ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.