కడ్తాల్, డిసెంబర్ 27 : ‘మనలో మనం కలిసిపోవడమే ధ్యాన యోగం, ధ్యానంతో అపారమైన జ్ఞానం లభిస్తుంది.. ప్రతి మనిషి భయం లేకుండా బుద్ధుడివలే జీవించాలి..’ అని సుభాశ్ పత్రీజీ కోరుకున్నారని పీఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ అన్నారు. మండలంలోని అన్మాస్పల్లి గ్రామ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్లో, పిరమిడ్ స్పిరిచ్చువల్ ట్రస్టు చైర్మన్ విజయభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగాలు ఏడో రోజుకి చేరాయి. బుధవారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు నిర్వహించిన ప్రాతఃకాల ధ్యానంలో ధ్యానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానులనుద్దేశించి పరిమళ పత్రీ మాట్లాడారు.
సత్యం తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నవాళ్లే పిరమిడ్లోకి వస్తారని తెలిపారు. సుభాశ్ పత్రీజీ సత్యాలు మాట్లాడేవారని, ధ్యానులకు సత్యం, అహింసా మార్గాలను చూపించారన్నారు. మనిషి తీవ్ర ఆలోచనలతో మానసిక ఒత్తిడికి గురవుతున్నాడని, మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే పరిపూర్ణుడవుతాడన్నారు. ప్రముఖ హిందూ ధర్మం ప్రచారకులు రాధామనోహర్ మాట్లాడుతూ ప్రతి మనిషి సకల ప్రాణకోటి కోసం, వాటి స్వేచ్ఛ కోసం పాటుపడాలన్నారు.
శ్వాస మీద ధ్యాసతో శక్తి లభిస్తుందన్నారు. మనల్ని మనం తెలుసుకోవడమే ఆత్మజ్ఞానమన్నారు. ధ్యానంతో జ్ఞానం కలుగుతుందని, మనిషి ఆయుష్షు శ్వాసపైనే ఆధారపడి ఉందన్నారు. సీజీఆర్ వ్యవస్థాపకురాలు లీలాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ ధర్మం, వృక్షం రెండు కాపాడబడితే జీవన ప్రయాణం సాఫీగా సాగుతుందని తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలన్నారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదన్నారు. పుడమిపై చెడు నశించి సత్యం జయించాలని చెప్పారు.
పత్రీజీ అందించిన ధ్యానం గొప్పదని, పత్రీజీ భౌతికంగా లేకపోయిన ప్రతి ధ్యానిలో ఆయన ఉన్నారన్నారు. ధ్యాన మహాయాగ సభలను అద్భుతంగా నిర్వహిస్తున్న విజయభాస్కర్రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ధ్యాన యాగంలో ప్రతి రోజూ నిర్వహిస్తున్న కళాకారుల నృత్య ప్రదర్శనలు ధ్యానులను అలరిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ కోర్పోలు విజయభాస్కర్రెడ్డి, సభ్యులు బాలకృష్ణ, సాంబశివరావు, హనుమంతురాజు, రాంబాబు, శ్రీరామ్గోపాల్, శివప్రసాద్, దామోదర్రెడ్డి, మాధవి, లక్ష్మి, నవకాంత్, ధ్యానులు పాల్గొన్నారు.