నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత
భీమ్గల్, డిసెంబర్ 5: ఒకప్పుడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న భీమ్గల్ పట్టణం నేడు అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. తాలూకా స్థాయిలో ఉండి కూడా అభివృద్ధికి నోచుకోని పట్టణం అన్ని సౌకర్యాలతో సుందరంగా మారుతున్నది. స్వరాష్ట్రంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చొరవ, అప్పటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత సహకారంతో భీమ్గల్ను మున్సిపాలిటీగా మార్చడంతో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను ఒప్పించి రూ. 25కోట్ల నిధులను మంజూరు చేయించారు. ఈ నిధులతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారు. 12 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అవసరమైన చోట బీటీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు.
పట్టాణాభివృద్ధిపై మంత్రి సమీక్షలు
పట్టణాభివృద్ధికి సంబంధించిన పనుల వివరాలను మంత్రి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. పలు కాలనీల్లో 8.300 కి.మీ బీటీ రోడ్లు, నాలుగు కిలోమీటర్ల సీసీ రోడ్లు, 13 కి.మీల డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తిచేశారు. ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు.
పట్టణ ప్రగతితో సమస్యలు దూరం
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సుమారు మూడు వేల మొక్కలను నాటారు. మున్సిపల్ ఆధ్వర్యంలో సెంట్రల్ నర్సరీని ఏర్పాటు చేసి లక్షా నాలుగువేల మొక్కలను పెంచుతున్నారు. గతంలో విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో మగ్గిన కాలనీల్లో నేడు ఎల్ఈడీ దీపాలు వెలుగుతున్నాయి. లింబాద్రి గుట్ట పై రూ. 2.60 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు, సెంట్రల్ లైటింగ్, రూ.74లక్షల నిధులతో గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణ పనులు పూర్తిచేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరో రూ.33.22కోట్ల నిధులతో అభివృద్ధి పనులు
ఇప్పటికే భీమ్గల్కు రూ.25 కోట్లు మంజూరు చేయగా, 15 కోట్లతో పనులు పూర్తిచేశారు. మిగతా రూ.10 కోట్లతోపాటు కొత్తగా మంజూరైన రూ.23.22 కోట్లు కలుపుకొని మొత్తం 33.22కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి , ఎమ్మెల్సీ
పట్టణంలోని ప్రధాన రహదారులను కలుపుకొని రూ.18. 48కోట్లతో ఏడు రోడ్లను నాలుగులైన్లుగా మార్చడం, రూ. 3 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం, రూ. మూడు కోట్లతో సీసీ, బీటీ, డ్రైనేజీ నిర్మాణం, రూ. కోటీ 50 లక్షలతో కల్యాణ మండపం, రూ.75లక్షలతో అర్బన్ పార్కు, రూ. 25లక్షలతో ఐదు చోట్ల ఓపెన్ జిమ్లు, రూ.2.10కోట్లతో వైకుంఠధామాల నిర్మాణ పనులకు మంగళవారం మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత శంకుస్థాపన చేయనున్నారు.
ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం..
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. మంత్రి సూచనలతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.గతంలో ఎన్నడూ లేనంతగా నిధులు మంజూరవుతున్నాయి. మంత్రికి పట్టణ ప్రజలు రుణపడి ఉంటారు.
-మల్లెల రాజశ్రీ, మున్సిపల్ చైర్పర్సన్