షాద్నగర్టౌన్ : ప్రతి గ్రామంలో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని షాద్నగర్ ఆర్డీఓ రాజేశ్వరి అన్నారు. ఇందులో భాగంగానే మండలం చించోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పలు గ్రామాల్లో, తండాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని, ఇంటింటి సర్వేను శుక్రవారం ఎంపీడీవో శరత్బాబుతో కలిసి పరిశీలించారు. గ్రామాల్లో, తండాల్లో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేసుకోని వారందరూ ఎందుకు వేసుకోవడం లేదని తెలుసుకుని వారు వేసుకునే విధంగా అవగాహన కల్పించారు. మండలంలో 100శాతం పూర్తయిన గ్రామాలతో పాటు ఏఏ గ్రామాల్లో ఎంతమంది వ్యాక్సిన్ వేసుకోలేదనే విషయాన్ని హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ షాద్నగర్ మున్సిపాలిటీతో పాటు గ్రామాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతుందన్నారు.
కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. వ్యాక్సిన్పై గ్రామస్తులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత సర్పంచుల, వైద్య సిబ్బందిపై ఉందన్నారు. మున్సిపాలిటీతో పాటు గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు, సూపర్వైజర్, ఏఎన్ఎం, ఆశాలు పాల్గొన్నారు.