తాండూరు, నవబంర్ 9: ప్రతిపక్షాలు తలకిందులుగా తపస్సు చేసినా…రాజకీయ ద్రోహులు కుట్రలెన్ని చేసినా…తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ దక్షిణ భారతదేశంలో చరిత్ర సృష్టిస్తారని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. గురువారం బీఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి పంజుగుల రోహిత్రెడ్డి నామినేషన్ దాఖలు రోడ్షో విజయోత్సవ ర్యాలీ జనసంద్రంగా జరిగింది.
నియోజక వర్గంలోని తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల పరిధిలోని గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు రోహిత్రెడ్డి నామినేషన్ దాఖలుకు స్వచ్ఛందం గా బ్యాండు, డప్పులతో ఉత్సాహంగా తరలివచ్చారు. రోహిత్రెడ్డి ఇంట్లో పూజలు చేసి, తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి, అన్ని మతాల పెద్దల ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ వేశారు. తాండూరులోని తన స్వగృహం నుంచి ప్రారంభమైన ర్యాలీ పోలీస్ స్టేషన్ చౌరస్తా, శివాజీచౌక్ మీదుగా ఆర్డీవో కార్యాలయం సమీపంలోని వీవీహెచ్ఎస్ పాఠశాల వరకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులతో కొనసాగింది.
ఈ సందర్భంగా ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ ప్రాణాలు లెక్కచేయకుండా కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నదన్నారు. తాండూరు పక్కనే ఉన్న కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రజా సంక్షేమ పథకాలు లేవన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని గుర్తు చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు పేదలకు కార్ఫొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం, విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించుటకు గురుకులాలు, మోడల్ స్కూల్తో పాటు ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.
తాండూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు అనగానే కొందరు అభ్యర్థులు గాల్లోంచి ఊడిపడ్డట్టుగా తమ అర్థ, అంగబలాలతో బరిలోకి దిగుతున్నారని ఎద్దేవా చేశారు. అటువంటి వారికి ఓటు వేస్తే మనం దిగజారినట్లే అవుతుందన్నా రు. అందుకు ప్రజలతో మమేకమై ఉండి వారి సమస్యల పరిష్కా రానికి కృషి చేసేవారికే ఓటేయాలని కోరారు. ప్రతిపక్ష పార్టీ నేతల అసత్య మాటలను నమ్మకుండా తాండూరు నియోజకవర్గం ప్రజ లు తమను ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే మరింత అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు.
ముచ్చటగా మూడోసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంను ఏర్పడుతుందన్నారు. అందుకు తగ్గట్లే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే అద్భుతమైన నూతన పథకాలతో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వీణ, వైస్ చైర్మన్ ఉమాశంకర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పురుషోత్తంరావు, పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.