రంగారెడ్డి, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ) : లోక్సభ ఎన్నికల ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటికే జిల్లా ఓటరు తుది జాబి తాను ప్రకటించగా..అధికారుల బదిలీల ప్రక్రియ సైతం మొదలైనది. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 14 మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. ఎన్నికల నిర్వహణలో కీలకపాత్ర పోషించే ఈవీఎంల పనితీరును పరిశీలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అధికారుల బదిలీలను చేపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో 2024 జనవరి 31 నాటికి మూడేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న రెవెన్యూ, పోలీసు, పంచాయతీ రాజ్ విభాగాల్లో బదిలీలు జరిగాయి. మరోవైపు సర్వీసుతో సంబంధం లేకుం డా సొంత జిల్లాలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు సైతం బదిలీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరో దఫా బదిలీలు జరుగనున్నాయి. జూన్ నెల ప్రాతిపదికగా మూడేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారుల జాబితాను ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు ఎన్ని కల సంఘానికి పంపించారు. ఈ మేరకు ఆదివారం జిల్లాకు చెందిన 14 మంది ఎంపీడీవోల బదిలీలు జరిగాయి.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 8న కలెక్టర్ ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. జిల్లాలో 3,369 పోలింగ్ కేంద్రాలుండగా..వీటి సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెక్ ప్రక్రియను చేపట్టనున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటి విడత తనిఖీ ప్రక్రియను చేపడతారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన 45 రోజుల్లోగా ఎలాంటి ఫిర్యాదులు రాకుంటే ఆ నియోజకవర్గంలో ఉపయోగించిన ఈవీఎంలనే లోక్ సభ ఎన్నికలకూ ఉపయోగిస్తారు. జిల్లాలో ఈ తరహా ఫిర్యాదుల లేకపోవడంతో శాసనసభ ఎన్నికల్లో ఉపయోగించి న ఈవీఎంలనే లోక్ సభ ఎన్నికల్లోనూ వినియోగించనున్నారు. షెడ్యూల్ విడుదలైన తర్వాత మరో దఫా నిర్వహించే ర్యాండమైజేషన్ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేని వాటిని గుర్తించి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారు.