2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను వసూలుపై వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారులు దృష్టి సారించారు. గతేడాది 98శాతం పన్ను వసూలుకాగా, ఈసారి పూర్తిస్థాయిలో రాబట్టడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ పంచాయతీల్లో ఈ ఏడాదికి సంబంధించి రూ.7.71 కోట్ల ఆస్తి పన్ను రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.3.85 కోట్లు(49.90 శాతం) వసూలైంది. పెండింగ్లో ఉన్న మరో రూ.3.86 కోట్లను వసూలు చేసేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ నెలాఖరు నుంచి జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వందశాతం రాబట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని పూడూరు, వికారాబాద్, మర్పల్లి, కుల్కచర్ల మండలాల్లో 50 శాతానికిపైగా ఆస్తిపన్ను వసూలైంది.
వికారాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని 556 గ్రామ పంచాయతీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేసేందుకు పంచాయతీ శాఖ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు రూ. 3.85 కోట్ల (49.90 శాతం) మేర ఆస్తి పన్ను వసూలయ్యింది. ఇంకా రూ.3.86 కోట్లు వసూలు చేయాల్సి ఉన్నది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రతినెలా నిధులను విడుదల చేస్తుండటంతోపాటు తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దీంతో ప్రతిఏటా ఆస్తిపన్ను లక్ష్యానికి అనుగుణంగా వసూలవుతున్నది.
గతంలో మాదిరిగా కాకుండా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఆస్తి పన్ను వసూలు ప్రక్రియను అధికారులు ప్రారంభిస్తున్నా రు. ప్రతి గ్రామ పంచాయతీకీ ప్రత్యేకంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించ డం కూడా ఆస్తి పన్ను వసూళ్లు పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు గడువు సమీపిస్తున్న దృష్ట్యా ఈనెలాఖరు నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను వసూలు లక్ష్యం రూ.6.85 కోట్లు ఉండగా 98 శాతం పన్ను, పన్నేతర పన్నులు వసూలయ్యాయి.
రూ.3.85 కోట్ల ఆస్తి పన్ను వసూలు…
జిల్లాలో ట్యాక్స్, నాన్ ట్యాక్స్లు కలిపి మొత్తం రూ.3.85 కోట్ల ఆస్తి పన్ను వసూలయ్యింది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో రూ.6.85 కోట్ల మేర వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 98 శాతం మేర వసూలైంది. అయితే ఈ ఏడాదిలో ఇప్పటివరకు వసూలైన ఆస్తి పన్నులో నాలుగు మండలాల్లో 50శాతానికిపైగా వసూలు కాగా, మిగతా మండలాల్లో 50 శాతం కంటే తక్కువగా వసూలైంది. పూడూరు, వికారాబాద్, మర్పల్లి, కుల్కచర్ల మండలాల్లో ఇప్పటివరకు అత్యధికంగా ఆస్తి పన్ను వసూలు కాగా.. బషీరాబాద్ మండలంలో రూ.16.61లక్షలు, బొంరాస్పేటలో రూ.14.27 లక్షలు, ధా రూరులో రూ.21.42 లక్షలు, దోమ మండలంలో రూ. 19.14 లక్షలు, దౌల్తాబాద్లో రూ.18.85లక్షలు, కొడంగల్లో రూ. 15.57 లక్ష లు, కోట్పల్లిలో రూ.10.45 లక్షలు, కుల్కచర్లలో రూ.24.79 లక్షలు, మర్పల్లిలో రూ. 23.56 లక్ష లు, మోమిన్పేటలో రూ.30.31 లక్ష లు, నవాబుపేటలో రూ.21.80 లక్షలు, పరిగిలో రూ. 23.91 లక్షలు, పెద్దేముల్లో రూ.18.19 లక్ష లు, పూడూరులో రూ.38.24 లక్షలు, తాండూరు లో రూ.41.76 లక్షలు, వికారాబాద్లో రూ. 17.81 లక్షలు, యాలాల మండలంలో రూ. 20.69 లక్షల ఆస్తి పన్ను వసూలయ్యింది.
వంద శాతం ఆస్తి పన్ను వసూలే లక్ష్యం..
జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేసేందుకు చర్యలను ముమ్మరం చేశాం. జిల్లాలో ఇప్పటివరకు 50 శాతం మేర ఆస్తి పన్ను వసూలయ్యింది. మరో రూ.3.86 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉన్నది. ఇందుకోసం ఈనెలాఖరు నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
-తరుణ్కుమార్, డీపీవో వికారాబాద్