రంగారెడ్డి, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ): టీచర్ ఎలిజిబిటీ టెస్ట్(టెట్)కు ఉమ్మడి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రంగారెడ్డి జిల్లాలో 32,749 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానుండగా.. 140 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 9,611 మంది కోసం 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించబోమని, అభ్యర్థులు పరీక్షా సమయానికి గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
పేపర్-1 ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2ను మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, పరిశీలకులు, హాల్ సూపరింటెండెంట్లను నియమించారు. అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రాల అన్ని వసతులు కల్పించామని రంగారెడ్డి జిల్లా డీఈవో సుశీందర్ రావు తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అభ్యర్థులందరూ సహకరించాలని పేర్కొన్నారు.