రంగారెడ్డి, మే 27 (నమస్తే తెలంగాణ): ఖరీఫ్ సాగుకు అన్నదాతలు సన్నద్ధమవుతున్నారు. విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. దళారులు దిగుబడుల ఆశచూపి నకిలీ విత్తనాలను అంటగడుతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి సైతం నకిలీ విత్తనాలు జిల్లాలోకి వస్తున్నాయి. నకిలీ దందాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపి వ్యవసాయ, పోలీస్శాఖల భాగస్వామ్యంతో నిఘాను ఏర్పాటు చేస్తున్నది. ఈ నేపథ్యంలో విత్తన కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యవసాయశాఖ పల్లెబాట పట్టింది. రైతులతో సమావేశాలు నిర్వహించి వారిని చైతన్యపర్చుతున్నది. జిల్లాలో ఈనెల 25 నుంచి ఈ కార్యక్రమం మొదలుకాగా..షెడ్యూలు ప్రకారం వారం రోజులపాటు కొనసాగనున్నది. ప్రతి వ్యవసాయ విస్తరణాధికారి క్లస్టర్ పరిధిలో 2నుంచి 3 గ్రామ పంచాయతీల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సోమవారం మొయినాబా ద్ మండలంలోని అప్పోజిగూడ, శంకర్పల్లి మండలంలోని మహాలింగాపూర్ గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి గీతారెడ్డి పాల్గొ ని రైతులకు విత్తన కొనుగోళ్లపై అవగాహన కల్పించారు.
జిల్లాలో వానకాలం సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచింది. అయినా డీలర్లు, మరికొంతమంది కృత్రిమ కొరతను సృష్టిస్తుండడంతో రైతులు ఇబ్బంది పడాల్సి వస్తున్నది. ప్రస్తు త వానకాలంలో జిల్లాలోని రైతులు 4,45,428 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తారని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసి ప్రణాళికనూ సిద్ధం చేసింది. ఇందులో అత్యధికంగా పత్తి 1,76,174 ఎకరాలు, వరి-1,38,187, మొక్కజొన్న -66,530 ఎకరాలు, ఉద్యాన పంటలతోపాటు ఇతర పంటలను 48,959 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. సాగు అంచనాకు అనుగుణంగా 44,594 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు నిర్ధారించారు. అలా గే 4,91,036 పత్తి ప్యాకెట్లు అవసరం ఉన్నందున ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులకు నివేదికను పంపించారు. 1,01,982 టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు రకాల విత్తనాలు, ఎరువుల నిల్వలను అందుబాటులో ఉంచామని అధికారులు చెబుతున్నారు. కొరత అనేదే లేదని..దీనిపై రైతులను చైతన్యపర్చేందుకే అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
అవగాహనతోనే మోసాలను అరికట్టొచ్చని భావించి వ్యవసాయ శాఖ అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ అవగాహన కార్యక్రమాల్లో ముఖ్యంగా విత్తన కొనుగోళ్ల సందర్భంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులు వివరిస్తున్నారు. లూజుగా ఉన్న సంచుల్లో ఉన్న విత్తనాలను కొనొద్దని సూచిస్తున్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన షాపు నుంచి రసీదును తప్పనిసరిగా తీసుకోవాలని..విత్తన ప్యాకెట్, బిల్లులను భద్రం గా ఉంచుకోవాలని.. వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన ఆధీకృత డీలర్ల దగ్గరే విత్తనాలను కొనాలని వివరిస్తున్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసా య, పోలీస్ శాఖల సమన్వయంతో జిల్లా స్థాయి, డివిజ న్ స్థాయి, మండల స్థాయిల్లో టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి పటిష్ట నిఘా పెట్టామని వివరించి రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.