పరిగి టౌన్, జూన్ 14 : నర్సింగ్ విద్యార్థి శిరీష హత్య కేసును పోలీసులు చేధించారు. బుధవారం పరిగిలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. పరిగి మండల పరిధిలోని కాళ్లాపూర్ గ్రామానికి చెందిన జుట్టు శిరీష(18) ఈ నెల 11వ తేదీన దారుణ హత్యకు గురై గ్రామ శివార్లలోని నీటి కుంటలో శవమై తేలింది. కండ్లలో గాయాలు ఉండటంతో ఎవరో హత్యచేశారని మృతురాలి అన్న శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించగా మృతురాలి సొంత బావ పరిగికి చెందిన ఎర్రగడ్డపల్లి అనిల్పై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్యచేశానని అనిల్ ఒప్పుకున్నాడని చెప్పాడు. తన మరదలు శిరీషను ఎలాగైనా శారీరకంగా అనుభవించాలన్న కోరిక ఉండేదని, కానీ తనను పట్టించుకోకుండా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండేదని తెలిపాడు. వికారాబాద్లో ఉంటూ నర్సింగ్ చేసేదని, తల్లికి ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆమెను హైదరాబాద్కు తీసుకెళ్లడంతో ఇటీవల తన మరదలు సొంతూరుకు వచ్చిందని తెలిపాడు.
ఈ నెల 10వ తేదీన వంట విషయంలో తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీనివాస్, శిరీషల మధ్యన గొడవ జరుగడంతో బావైన అనిల్కు శ్రీనివాస్ ఫోన్చేసి అక్క వంట చేయడం లేదని చెప్పాడు. పరిగిలో ఉన్న అనిల్ వెంటనే కాళ్లాపూర్కు వెళ్లి మరదలు శిరీషను మందలించాడు. దీంతో ఇంట్లో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. అక్క కనిపించడం లేదని మృతురాలి తమ్ముడు శ్రీనివాస్ బావైన అనిల్కు ఫోన్ చేసి చెప్పడంతో తన భార్యను తీసుకొని అత్తగారి గ్రామమైన కాళ్లాపూర్కు వచ్చి పరిగి వెళ్లిపోయాడు. తర్వాత మళ్లీ కాళ్లాపూర్ వెళ్తుండగా గ్రామ సమీపంలోని గోనెమైసమ్మ గుడి సమీపంలో మరదలు శిరీష కనిపించింది.
ఇంత రాత్రి వేళలో ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నించగా, ఇద్దరి మధ్యన గొడవ జరిగింది. కోపంతో అనిల్ ఖాళీ బీరుబాటిల్ పగలగొట్టి కండ్లలో పొడిచాడు. పక్కనే ఉన్న నీటి కుంట దగ్గరకు తీసుకెళ్లి నీటిలో ముంచాడు. దీంతో చనిపోయిందన్న నిర్దారణకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి పరిగికి వెళ్లాడు. అనిల్ను అదుపులోకి తీసుకొని విచారించగా నిజం ఒప్పుకున్నాడని ఈ మేరకు అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు. హత్యకేసు ఛేదించడంలో పరిగి డీఎస్పీ కరుణసాగర్రెడ్డి, సీఐ వెంకట్రామయ్య, ఎస్సై విఠల్రెడ్డిని అభినందించారు.