లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇటీవల శాసనసభ ఎన్నికల్లో వినియోగించిన పోలింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాలు ఓటర్లకు అందుబాటులో ఉన్నాయా? లేక దూరంగా ఉన్నాయా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
రంగారెడ్డి, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : లోక్సభ ఎన్నిక సందర్భంగా ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో ఓటర్ల సంఖ్య 1500లు ఉండాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల తక్కువగా, మరికొన్ని చోట్ల ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఎక్కువ మంది ఉన్న కేంద్రాల ఓటర్లను సమీప కేంద్రాల్లో విలీనం చేయడమా ? లేదా కొత్తగా మరో కేంద్రాన్ని ప్రతిపాదించడమా ? అనే అంశాలను పరిశీలించి నివేదికను రూపొందించారు.
కొత్తగా 86 కేంద్రాల ఏర్పాటు..
లోక్సభ ఎన్నికల్లో జిల్లాలో పోలింగ్ కేంద్రాలు పెరుగనున్నాయి. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నాటికి 3,369 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 1500లకు పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 73 ఉండగా.. 2కి.మీ.ల దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రాలు 13 ఉన్నాయి. దీంతో 2కి.మీ.ల దూరం లోపల కేంద్రాలు ఉండేలా చర్యలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నియోజకవర్గస్థాయిలో అధికారులు కొత్తగా 86 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు జాబితాను రూపొందించారు. వీటిని జిల్లా కలెక్టర్ పునః పరిశీలించి ఈసీకి నివేదించారు. అక్కడి నుంచి అనుమతులు రావాల్సి ఉన్నది. ఈసీ నుంచి అనుమతులు వస్తే.. లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్య 3,455కు పెరుగనున్నాయి.
ఒకే చోట ఓటు వేసేలా..
ప్రతి ఎన్నికలోనూ పోలింగ్ కేంద్రాలను సర్దుబాటు చేసినా కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో గత ఇబ్బందులను అధిగమించడంపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఒక కాలనీలోని ఓటర్లకు దూరాన ఉన్న మరో ప్రాంతంలో పోలింగ్ కేంద్రం ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ఒక కాలనీలోని ఓటర్లందరూ ఒకే చోట ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక కుటుంబంలోని ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉండడంతో కొన్నిచోట్ల ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఓటింగ్ శాతం తగ్గుతున్నది. ఈసారి కుటుంబంలోని అందరూ ఒకే కేంద్రంలో ఓటు వేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
వసతులపై ఆరా..
గత అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అక్కడక్కడా పలు లోపాలు బహిర్గతమయ్యాయి. పోలింగ్ కేంద్రాల్లో వసతులు లేక ఓటర్లు ఇబ్బంది పడ్డారు. లోక్సభ ఎన్నికల్లో ఈ సమస్యలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కేంద్రాల పరిస్థితిని తెలుసుకున్నారు. ఎక్కడైనా భవనాలు శిథిలావస్థలో ఉన్నాయా ? ఏమైనా మరమ్మతులు అవసరమా !.. అన్న కోణాల్లో వివరాలు సేకరించారు. శిథిలావస్థలో ఉంటే ప్రత్యామ్నాయంగా సమీపంలోని మరో భవనంలోకి కేంద్రాలను మార్చనున్నారు. పోలింగ్ నాటికి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుండడంతో పోలింగ్ కేంద్రాల్లో నీడ వసతి, తాగునీటి సదుపాయం కల్పన వంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టారు.