రంగారెడ్డి, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ) లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారం నుంచి ప్రారంభమవుతున్నది. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల పార్లమెంటు స్థానానికి సంబంధించి రాజేంద్ర నగర్లోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమవుతున్న నామినేషన్ల ప్రక్రియ 25వ తేదీ వరకు ఆదివారం మినహా అన్ని రోజుల్లో కొనసాగనున్నది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారి నామినేషన్లను స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన.. 29న ఉపసంహరణ.. మే 13న పోలింగ్.. జూన్ 4న కౌంటింగ్తో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియనున్నది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.
నామినేషన్ కేంద్రం వద్ద నిషేధాజ్ఞలు..
జిల్లాలో లోక్సభ ఎన్నికలకు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ అధికారులకు శిక్షణ వంటి ప్రక్రియలను చేపట్టారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో మొత్తం 29,28,186 మంది ఓటర్లు ఉండగా.. ఎన్నికల నిర్వహణకు 2,877 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 13,443 మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల్లో విధులు నిర్వర్తించనున్నారు. అలాగే ఎన్నికల పర్యవేక్షణ కోసం 259 మంది సెక్టోరియల్ అధికారులను నియమించారు. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ గత నెల 16న వెలువడగా.. నోటిఫికేషన్ విడుదలవుతున్న గురువారం నుంచి లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నామినేషన్ల స్వీకరించే రాజేంద్ర నగర్ ఆర్వో కార్యాలయంలో అకౌంటింగ్ టీం, వీవీటీ టీం, సీ విజిల్, హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కానున్నది. అలాగే నామినేషన్ల వివరాలను ఎప్పటికప్పుడు ఎన్కోర్ అనే ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రానికి 200మీటర్ల వరకు ఆంక్షలు విధించారు. వాహనాలేవీ 200 మీ. దాటి లోపలకు రాకూడదు. దరఖాస్తు సమయంలో ఐదుగురికి మాత్రమే అవకాశాన్ని కల్పించారు. అంటే.. అభ్యర్థితోపాటు మరో నలుగురికి మాత్రమే వెళ్లొచ్చు. సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.
మహూర్తం చూసుకుంటున్న అభ్యర్థులు..
ముహూర్తాలు చూసుకుని నామినేషన్లను దాఖలు చేసేందుకు వివిధ పార్టీలకు చెందిన ఎంపీ అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21న ఆదివారం పోను.. ఏడు రోజుల సమయం ఉంది. ఈ ఏడు రోజుల్లో తమకు కలిసొచ్చే రోజు కోసం అభ్యర్థులు పండితుల సలహాలు తీసుకుంటున్నారు. పేరు, నక్షత్రాన్ని బట్టి మంచి తేదీ చూసుకుని నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఈ నెల 18, 19, 21, 23, 24 తేదీల్లో ముహూర్తం బాగుందని పండితులు చెబుతున్నారు. 21న ఆదివారం కావడంతో మిగిలిన నాలుగు రోజుల్లో ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ కూడా ఇప్పటివరకు అభ్యర్థులకు ఇంకా బీ-ఫామ్లు ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేవెళ్ల ఎంపీ స్థానానికి అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ను ప్రకటించారు. గురువారం తెలంగాణ భవన్లో జరిగే పార్టీ సమావేశంలో బీ-ఫామ్ను అందజేయనున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అదే ఊపుతో మంచి ముహూర్తం చూసుకుని నామినేషన్ వేసేందుకు కాసాని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.