Sound Pollution | నాంపల్లి కోర్టులు, మార్చి 9 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో అధిక శబ్దకాలుష్యంతో రాత్రి వేళల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆర్మీ అధికారి సతీశ్ భరద్వాజ్ రాసిన ఉత్తరాన్ని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ సుమోటోగా పరిగణించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం సమక్షంలో విచారణను ప్రారంభించింది. వివరాల్లోకి వెళితే.. పెండ్లిలు, శుభకార్యాలకు డీజే, ఆర్కెస్ట్రా ఏర్పాటు చేయడం వల్ల శబ్దకాలుష్యానికి దారితీస్తున్నదని ఆర్మీ అధికారి భరద్వాజ్ పేర్కొన్నారు.
అదేవిధంగా పటాకులు పేల్చడం, రోడ్డుపైనే వాహనాలను పార్క్ చేయడం, బీరుసీసాలు, మందుబాటిళ్లు, తినుబండారాల కవర్లు, చెత్తను పరిసర ప్రాంతంలోనే చెల్లాచెదురుగా పడేసినా ఫంక్షన్హాళ్ల యజమానులు పట్టించుకోవడం లేదని కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తాడ్బండ్ ప్రాంతంలో ఇండ్ల మధ్యలోనే బంటియా, ఇంపీరియల్ గార్డెన్స్ ఉన్నాయని, అధికంగా జనావాసాలు ఉండడంతో కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నారని లేఖలో వివరించారు.
కాగా శబ్ద కాలుష్య నివారణకు పోలీసు అధికారులు జీఓ నం.170, 2010ని అమలు చేయడంలేదా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. గతంలో ఫంక్షన్హాళ్లకు రూ.10వేల జరిమానా విధించడం కూడా జరిగిందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. జరిమానాతో మార్పేమీ లేదని, యజమానులకు నోటీసులు జారీ చేయాలని బోయిన్పల్లి పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 14న ఫంక్షన్హాళ్ల యజమానులు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.