ప్రజాపాలన కార్యక్రమానికి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. అభయహస్తం పథకాలకు తెల్లరేషన్ కార్డు తప్పనిసరి కావడంతో ప్రజలు అధికంగా రేషన్ కార్డుల కోసమే దరఖాస్తు చేసుకుంటున్నారు. త్వరలో కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ‘ప్రజాపాలన’లో అధికారులు పేర్కొంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి పథకాలకూ అత్యధికంగా దరఖాస్తులు చేసుకుంటున్నారు.
వికారాబాద్ జిల్లాలోని 262 గ్రామపంచాయతీలు, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లోని 41 వార్డుల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తైంది. ఈ మూడు రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో 93,761 కుటుంబాలు పాల్గొనగా, 87,458 దరఖాస్తులు వచ్చాయి. తహసీల్దార్లు, ఎంపీడీవోల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బృందాలను జిల్లా యంత్రాంగం నియమించింది. రెవెన్యూ, వ్యవసాయ, విద్య, వైద్య, విద్యుత్తు, పౌరసరఫరాల శాఖల అధికారులతో ఎంపీడీవోలు, తహసీల్దార్లు బృందాలను ఏర్పాటు చేశారు. ‘ప్రజాపాలన’లో దరఖాస్తు చేసుకోనివారు సంబంధిత మండల, మున్సిపాలిటీ కార్యాలయాల్లో దరఖాస్తులను ఇవ్వవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
– వికారాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. అభయహస్తం పథకాల్లో భాగంగా మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను అమలు చేసేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను డిసెంబర్ 28 నుంచి చేపట్టారు. అభయహస్తం పథకాలను అమలు చేసేందుకు తెల్లరేషన్ కార్డు తప్పనిసరి కావడం, చాలా మందికి తెల్ల రేషన్కార్డులు లేకపోవడంతో వాటి కోసమే అధిక మొత్తంలో ప్రజలు దరఖాస్తు చేసుకుంటున్నారు. తెల్ల రేషన్ కార్డులు లేని వారికి త్వరలో జారీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నది.
ప్రజాపాలన దరఖాస్తుల్లో రేషన్ కార్డు నెంబర్ వద్ద లేదని పూర్తి చేయడం లేదా ప్రత్యేకంగా తెల్ల రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులను ప్రజాపాలనలో భాగంగా అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డులతోపాటు ఇందిరమ్మ ఇండ్ల పథకం, గృహజ్యోతి పథకానికి అధిక మొత్తంలో దరఖాస్తు చేసుకుంటుండడం గమనార్హం. ఎవరైనా దరఖాస్తులు ఇవ్వనట్లయితే సంబంధిత మండల ఎంపీడీవో కార్యాలయంలోగాని, మున్సిపాలిటీల్లోని ప్రజలు అయితే సంబంధిత మున్సిపాలిటీ కార్యాలయంలోగాని దరఖాస్తులను అందజేయవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు చేపట్టిన ప్రజాపాలనలో భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా మూడు రోజుల్లో 87,458 దరఖాస్తులు వచ్చాయి. డిసెంబర్ 28న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభంకాగా మొదటి రోజు 19,865 దరఖాస్తులు రాగా.. రెండో రోజు 26,913., మూడో రోజు 40,680 దరఖాస్తులు వచ్చాయి. తాండూరు నియోజకవర్గంలో 27,175 దరఖాస్తులు, వికారాబాద్లో 24,727., పరిగిలో 19,988., కొడంగల్లో 12,767., చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబుపేట్ మండలంలో 2,801 దరఖాస్తులు వచ్చాయి.
మరోవైపు మూడు రోజుల్లో జిల్లాలోని 262 గ్రామపంచాయతీల్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తికాగా.. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లోని 41 వార్డుల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యింది. రెండు రోజుల్లో ప్రజాపాలన కార్యక్రమంలో 93,765 కుటుంబాలు పాల్గొన్నాయి. ఈ నెల 8 వరకు ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించనున్నారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు రెవెన్యూ అధికారితోపాటు వ్యవసాయ, విద్య, వైద్య, విద్యుత్తు, పౌరసరఫరాల శాఖల అధికారులతో ఎంపీడీవోలు, తహసీల్దార్ల బృందాలను ఏర్పాటు చేశారు. రోజుకు రెండు గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.
తెల్ల రేషన్ కార్డు కోసం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలో ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులను జారీ చేస్తుంది. ఎవరూ కూడా ప్రజాపాలన దరఖాస్తులను విక్రయించవద్దు. దరఖాస్తులను విక్రయిస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. గ్రామపంచాయతీలు, వార్డుల్లో దరఖాస్తు చేసుకోలేనివారు దరఖాస్తును పూర్తి చేసి సంబంధిత మండల, మున్సిపాలిటీ కార్యాలయాల్లో అందజేయవచ్చు.
– కలెక్టర్ నారాయణరెడ్డి