బొంరాస్పేట, మార్చి 31: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు రోజూ చెల్లించే కూలిని కేంద్ర ప్రభుత్వం సవరించింది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఉపాధి కూలి రూ.272 చెల్లిస్తుండగా తాజాగా దీనిని రూ.28లకు పెంచింది. దీంతో కూలీలకు దినసరి వేతనం రూ. 300లకు పెరుగగా.. నేటి నుంచి అమల్లోకి రానున్నది. 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ప్రారంభం కాగా మొదట్లో కూలీలకు రూ.87.50 చెల్లించేవారు. 2022లో రూ.12 పెంచగా 2023లో గరిష్ఠంగా కూలిని రూ.272 లుగా నిర్ణయించారు. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కొత్త వేతనాలను అమలు చేస్తున్నది. తాజా నిర్ణయంతో కూలీలకు ప్రయోజనం కలుగనున్నది.
వికారాబాద్ జిల్లాలో మొత్తం 1.34 లక్షల జాబ్ కార్డులుండగా 2.55 లక్షల మంది యాక్టివ్ కూలీలున్నారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో వ్యవసాయ పను లు లేక గ్రామాల్లో కూలీలు ఉపాధిహామీ పనులకు వెళ్తున్నారు. ఒండ్రుమట్టి తొలగించడం, కాల్వల మరమ్మతులు, పొలాల్లో నీటి నిల్వ కట్టడాల పనుల్లో పాల్గొని ఉపాధి పొందుతున్నారు. చేసిన పనులను కొలిచి..రికార్డు చేసిన దాని ప్రకారం కూలీలకు ప్రతిరోజూ రూ.250 నుంచి రూ.300 వరకు కూలి లభిస్తున్నది.
దినసరి కూలిని రూ.28లకు పెంచినా కూలీలు కొంత అసంతృప్తిగానే ఉన్నారని చెప్పొచ్చు. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉండడంతో ఉపాధిహామీ పనులు చేసే కూలీలకు ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు దినసరి కూలీ తోపాటు వేసవి అదనపు భత్యం చెల్లించేది. ఈ సమయంలో 15 నుంచి 30 శాతం వరకు అధికంగా కూలీ వచ్చేది. రెండేండ్ల నుంచి దానిని తొలగించడంతో కూలీలకు అదనపు భత్యం రావడం లేదు. అదేవిధంగా పార, గడ్డపారకు కూడా అదనంగా చెల్లించేవారు దీనిని కూడా నిలిపివేశారు.