రంగారెడ్డి, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ) : పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణకు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. 1 నుంచి 19 ఏండ్లలోపు వారికి అల్బెండజోల్ మాత్రలను పంపిణీకి కార్యాచరణను రూపొందించింది. ఈ నెల 12న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మాత్రలను పంపిణీ చేయనున్నారు. దీనిపై ఇప్పటికే సంబంధిత అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతోపాటు అవసరమైన మాత్రలను అందుబాటులో ఉంచారు.
1 నుంచి 19 ఏండ్లలోపువారు జిల్లాలో మొత్తం 8,09,357 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ప్రతి ఒక్కరూ మాత్రలు వేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలలోని చిన్నారులు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లోని విద్యార్థులకు మాత్రలు వేయనున్నారు. మాత్రల పంపిణీ కార్యక్రమంలో జిల్లాలోని 42 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, 406 మంది ఏఎన్ఎంలు, 1,368 మంది ఆశ వర్కర్లు, ఇతర సూపర్వైజర్లు పాలుపంచుకోనున్నారు. 9 లక్షల అల్బెండజోల్ మాత్రలను అందుబాటులో ఉంచారు.
నులి పురుగులతో పోషకాహార లోపం వల్ల రక్తహీనత, కడుపు నొప్పి వంటి అనారోగ్య లక్షణాలు ఏర్పడి పిల్లలు చదువులో వెనుకబడిపోతున్నారు. నులి పురుగుల నివారణకు ఏడాదిలో రెండుసార్లు అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తున్నాం. మాత్రలను మింగిన తర్వాత వికారం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇవి కొద్దిరోజుల్లోనే తగ్గిపోతాయి. కాబట్టి ఆందోళన చెందవద్దు. అత్యవసరమైతే 108 సేవలను వినియోగించుకోవాలి.
– డాక్టర్ వెంకటేశ్వర్ రావు, డీఎంహెచ్వో, రంగారెడ్డి జిల్లా