యాచారం, ఫిబ్రవరి 16 : మండలంలోని నందివనపర్తి గ్రామంలో కొలువుదీరిన నందీశ్వరుడి జాతరకు నందీశ్వర మహాక్షేత్రం ముస్తాబవుతున్నది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో మూడురోజుల పాటు జాతర నిర్వహణకు ఆలయ నిర్వాహకులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి రంగు లు వేశారు. ఆలయంలోని ఎనిమిదడుగుల మహానంది, శివలింగం, అమ్మవారి విగ్రహాలను సుందరంగా అలంకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో విద్యుత్ దీపాలను అమరుస్తున్నారు. వ్యాపారులు సైతం ఇప్పటికే వివిధ రకాల దుకాణ సముదాయాలను ఏర్పాటు చేసుకొని అక్కడే పిండివంటలు, ఇతర వస్తువులను తయారు చేస్తున్నారు. నందీశ్వరాలయంలో ఈనెల 18, 19, 20వ తేదీల్లో జాతర కొనసాగనున్నది. ఆలయం నలుమూలల వినాయకుడు, ఆంజనేయస్వామి, దత్తాత్రేయ స్వామి, కుమారస్వామి విగ్రహాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకతగా స్థానికులు చెప్పుకుంటారు.
ఉత్సవాలు ఇలా..
ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 18న ఉదయం ఆరుగంటలకు అఖండ దీపారాధన, కలశ స్థాపన, విఘ్నేశ్వర పూజ, నిరంతర ఏకాదశ రుద్రాభిషేకం, ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు గీతాయజ్ఞం, రాత్రి ఎనిమిది గంటల నుంచి మహాశివరాత్రి జాగారం, భజన కార్యక్రమం, 12 గంటలకు లింగోద్భవం, రుద్రాభిషేకం, 19న ఉదయం 6గంటలకు రుద్రాభిషేకం, 8.30 గంటల నుంచి 12 గంటల వరకు గీతాయజ్ఞం, అన్నదానం, సాయంత్రం 6గంటలకు శివపార్వతుల కల్యాణం, 20న ఉదయం 6 గంటలకు రథోత్సవం, అభిషేకాలు, శ్రీపార్వతీదేవి అమ్మవారికి కుంకుమార్చనలు, ఉదయం 8 నుంచి 12 గంటల వరకు గీతాయజ్ఞం, సామూహిక వ్రతాలు, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తలు, అర్చకులు తెలిపారు.
ఆలయానికి చేరుకునే మార్గం..
ఇబ్రహీంపట్నం నుంచి కందుకూరు వెళ్లే దారిలో బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. సాగర్ రింగ్రోడ్డు, ఇబ్రహీంపట్నం నుంచి మాల్, దేవరకొండ వెళ్లే బస్సుల్లో యాచారం వద్ద దిగి అక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల్లో నందివనపర్తికి చేరుకోవచ్చు. శ్రీశైలం-హైదరాబాద్ హైవే కందుకూరు గేటువద్ద దిగి యాచారం వెళ్లే మార్గం ద్వా రా నందీశ్వరాలయాన్ని చేరుకోవచ్చు.