వికారాబాద్, మార్చి 28 : వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 34 వార్డులు ఉన్నాయి. ప్రతిరోజూ చెత్తను సేకరించేందుకు 17 ఆటోలు, 6 ట్రాక్టర్లు ఉన్నాయి. ఒక్క ఆటో రెండు వార్డుల్లో చెత్తను సేకరించాల్సి ఉంటుంది. డంపింగ్ యార్డు వికారాబాద్కు 3కిలో మీటర్ల దూరంలో వికారాబాద్ మండలం గోదుమగూడ వెళ్లే దారిలో ఉంది. గతంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు డంపింగ్ యార్డును 10 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చెత్తను డంపింగ్ యార్డుకు చేరవేస్తున్నారు. రోజుకు 26మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్ యార్డుకు చేరుతున్నది.
గతంలో 14వ ఆర్థిక ప్రణాళిక నిధులు రూ.3.82కోట్లు మంజూరు అయ్యాయి. ఈ నిధులతో డంపింగ్ యార్డు ప్రహరీ, సీసీ రోడ్లు, షెడ్లు, తడి, పొడి చెత్తను వేరు చేసే మిషనరీలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఖర్చు చేయాల్సి ఉంది. అప్పట్లో కాంట్రాక్టర్కు అప్పగించి పనులు ప్రారంభించారు. 2021లో వికారాబాద్ డంపింగ్ యార్డుకు రూ.18లక్షలతో సీసీ రోడ్డు పనులు చేశారు. రూ.49లక్షలతో డంపింగ్ యార్డు ప్రహరీ నిర్మించారు. డంపింగ్యార్డులో షెడ్డు నిర్మాణ పనులు కొనసాగాయి.
షెడ్డు ఏర్పాటు కోసం పిల్లర్లను సైతం ఏర్పాటు చేశారు. సుమారు రూ.2.07కోట్లు ఖర్చు కాగా, రూ.1.75 కోట్లు మిగిలినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. డంపింగ్ యార్డులో పనులు పూర్తి చేయకపోవడంతో రోజుకు 26 మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్ యార్డుకు చేరుతుంది. దాదాపు 4 సంవత్సరాల నుండి చెత్తను డంపింగ్ యార్డులో వేయడంతో గుట్టుగుట్టలుగా పేరుకపోయింది. తడి,పొడి చెత్తను వేరు చేసే మిషన్లు అందుబాటులోకి వస్తే పొడి చెత్తను అమ్మి మున్సిపల్కు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కలెక్టర్, ప్రజాప్రతినిధులు స్పందించి వచ్చిన నిధులను వృథా చేయకుండా నిలిచిపోయిన పనులను పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని వికారాబాద్ పట్టణ ప్రజలు కోరుతున్నారు.