బొంరాస్పేట, మే 17 : తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నది. మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలను సమకూర్చగా, ఇంగ్లిష్ మీడియంలోనూ విద్యా బోధనను అందిస్తున్నది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో విద్య అందుతుండగా, విద్యార్థులను తీర్చిదిద్దేందుకు మరో నిర్ణయం తీసుకున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ విద్యా బోధన అందించాలని నిర్ణయించి, వికారాబాద్ జిల్లాలోని 111 ఉన్నత పాఠశాలలను విద్యాశాఖ ఎంపిక చేసింది. అందుకు అవసరమైన సామగ్రిని కూడా సరఫరా చేసింది. ఒక్కో పాఠశాలలో మల్టిఫుల్ ఫీచర్స్ డిజిటల్ స్క్రీన్ డివైజ్ను ఏర్పాటు చేస్తున్నారు. 8, 9, 10 తరగతులకు ఒక్కోటి చొప్పున కేటాయిస్తున్నారు. వీటికి ఇంటర్నెట్, వైఫై, మొబైల్ హాట్స్పాట్ సదుపాయాన్ని కల్పించనున్నారు. దృశ్య శ్రవణ విధానంతో పాఠాలు బోధిస్తే సులభంగా అర్థమవడంతో పాటు ఎక్కువగా గుర్తుంచుకుంటారన్నదే రాష్ట్ర సర్కార్ ఉద్దేశం.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చే యడానికి రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలలను దశల వారీగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇప్పటికే జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలలు కొత్త కళను సంతరించుకున్నాయి. మన ఊరు.. మన బడి పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టి నిధులు కేటాయించడంతో చాలా చోట్ల వాటి రూపురేఖలు మారిపోయాయి. ఆకర్శణీయ రంగులతో.. సరికొత్త హం గులతో .. మౌలిక వసతుల కల్పనతో అవి కార్పొరేట్ పాఠశాలలను తలపిస్తున్నాయి. మొదటి విడుతలో ఎంపిక చేసిన పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, వంట గదులు, ప్రహరీల నిర్మాణం, విద్యుత్ సౌకర్యం, భవనాలకు మరమ్మతు, ఫర్నీచర్ తదితర వసతులను సమకూర్చిన ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనపై దృష్టి సారించింది. ఇందు లో భాగంగా మన ఊరు.. మన బడిలో మొదటి విడుతలో ఎంపిక చేసిన 111 ఉన్నత పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ బోధన అందించాలని నిర్ణయించింది.
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్ జిల్లాలోని 111 ఉన్నత పాఠశాలలకు విద్యాశాఖ డిజిటల్ బోధనకు అవసరమైన సామగ్రిని సరఫరా చేసింది. మన ఊరు.. మన బడి కార్యక్రమం కింద రూ.కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి వాటిని కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా 8, 9, 10వ తరగతుల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించడానికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ విధానంలో పాఠాలు బోధించాలని నిర్ణయించింది. దృశ్య, శ్రవణ విధానంలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తే వాటిని సులభంగా అర్థం చేసుకోవడంతో పాటు పాఠంలోని అంశాలను ఎప్పుడూ గుర్తించుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఇంగ్లిష్ మీడియంలో బోధన కొనసాగుతుండగా తాజాగా డిజిటల్ పాఠాలు అందుబాటులోకి రానుండడంతో విద్యార్థులు మరింత ప్రతిభావంతులుగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యా బోధనపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మల్టీ ఫీచర్స్తో డిజిటల్ స్క్రీన్
మన ఊరు.. మన బడి కార్యక్రమంలో ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ విధానంలో పాఠాలు బోధించడానికి మల్టిఫుల్ ఫీచర్స్ డిజిటల్ స్క్రీన్ డివైజ్ను ఏర్పాటు చేస్తున్నారు. 75 అంగుళాలు ఉన్న స్క్రీన్లను 8, 9, 10 తరగులకు ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. వీటికి ఇంటర్నెట్, వైఫై, మొబైల్ హాట్స్పాట్ సదుపాయం కల్పిస్తారు. తద్వారా విద్యార్థులకు కావాల్సిన ఆడియో, వీడియోలు, త్రీడీ ఇమేజ్లను గూగుల్ సెర్చ్, యూట్యూబ్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ స్క్రీన్ను మూసివేస్తే గ్రీన్చాక్ బోర్డులా కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. మొబైల్ నుంచి ఈ డివైజ్కి వీడియోలు పంపించుకోవచ్చు. పాఠాలకు సంబంధించిన మ్యాటర్ను మనం కోరిన భాషలో చదివి వినిపిస్తుంది. విద్యార్థులకు బోధించిన పాఠాలను డీపీఎఫ్, డాక్యుమెంట్, జేపీజీ, పీపీటీ ఫార్మాట్లో సేవ్ చేసుకునే సదుపాయం ఉంది. జిల్లాలోని అన్ని పాఠశాలలకు వీటిని సరాఫరా చేశారు. టీవీ స్క్రీన్లతో పాటు అవసరమైన బ్యాటరీలు, స్టెబిలైజర్ను కూడా ప్రభుత్వం సరఫరా చేసింది.
ఆసక్తి పెరుగుతుంది
పుస్తకంలో ఉన్న పాఠాలను టీవీల్లో చూపించి బోధిస్తే వాటిపై ఆసక్తి పెరుగుతుంది. శ్రద్ధగా పాఠాలను వినడంతో అవి గుర్తుండిపోతాయి. డిజిటల్ విద్యా బోధన విద్యార్థులకు చాలా ఉపయోగంగా ఉంటుంది.
–మణికంఠ, 8వ తరగతి, బొంరాస్పేట
డిజటల్ బోధన హర్షణీయం
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాభోదన చేయాలని నిర్ణయించడం హర్షణీయం. మన ఊరు.. మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నది. డిజిటల్ విధానంలో బోధిస్తే విద్యార్థులు పాఠాలను సులభంగా అర్థం చేసుకుంటారు. పేద విద్యార్థులు కూడా చదువులో ముందంజ వేస్తారు.
–కొండవోని సత్యనారాయణ, ఎస్ఎంసీ చైర్మన్, దుద్యాల ఉన్నత పాఠశాల
అన్ని పాఠశాలలకు సామగ్రి చేరవేశాం
మన ఊరు.. మన బడి కార్యక్రమం కింద జిల్లాలో ఎంపిక చేసిన 111 ఉన్నత పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ విద్యాబోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 8, 9, 10 తరగతులకు పాఠాలు బోధించడానికి అవసరమైన స్క్రీన్లు, బ్యాటరీలు, స్టెబిలైజర్లను సరఫరా చేశాం. పాఠశాలలు తెరిచే నాటికి ఇవి అందుబాటులో ఉంటాయి. డిజిటల్ విద్యాబోధన గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చదువులో రాణించాలి.
–రవికుమార్, సెక్టోరియల్ అధికారి