కడ్తాల్, ఏప్రిల్ 29 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ, ఎమ్మెల్సీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల కురిసిన వానలకు పంట నష్టం పరిహారాన్ని త్వరగా అందించాలని, చెరువులు, కుంటలు అక్రమణకు గురవుతున్నాయని, గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు సరఫరాలో అంతరాయం కలుగుతున్నదని ఎంపీటీసీలు గోపాల్, శ్రీనివాస్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు బాబా సభ దృష్టికి తీసుకొచ్చారు.
నాలుగేండ్లలో మండల పరిషత్కు ఎన్ని నిధులు వచ్చాయి, ఒక్కొక్క ఎంపీటీసీకి ఎన్ని నిధులు కేటాయించారని వైస్ ఎంపీపీ ఆనంద్ సభలో లేవనెత్తారు. గత సభలో చేసిన తీర్మానాలు అమలు చేశారా, ఎన్ని సమస్యలను పరిష్కారించారని ఎంపీ అధికారులను ప్రశ్నించారు. సర్వసభ్య సమావేశంలో తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఎంపీడీవో రామకృష్ణపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడ్తాల్-గుర్లకుంట తండా బీటీ రోడ్డు నిర్మాణంలో ఎందుకు జాప్యం జరుగుతున్నదని, గుర్లకుంట చెరువు కట్టను వెడల్పు చేయాలని ఎమ్మెల్సీ అధికారులకు సూచించారు. మద్దెలకుంట-రావిచేడ్ బీటీ రోడ్డు పనులు ప్రారంభమై నాలుగేండ్లు గడుస్తున్నా ఎందుకు పూర్తి చేయడంలేదని జడ్పీటీసీ ప్రశ్నించారు.
గ్రామాభివృద్ధిలో సర్పంచ్లదే కీలకపాత్ర
ఎంపీ రాములు మాట్లాడుతూ.. అధికారులు గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని తెలిపారు. అధికారులు ఉద్యోగాన్ని ఛాలెంజ్గా తీసుకొని, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో సర్పంచ్లదే కీలకపాత్ర అని అన్నారు. ఎంపీడీవో కార్యాలయానికి నిధులు కేటాయించాలని కలెక్టర్ హరీశ్కు ఎంపీ ఫోన్ చేసి మాట్లాడారు.
ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నదే సీఎం అభిమతం
ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణలోని గ్రామాలన్నీ పరిశుభ్రంగా మారి జాతీయ అవార్డులు గెలుచుకున్నాయని పేర్కొన్నారు. ప్రజలు సుభిక్షం ఉండాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమన్నారు. దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండాయని తెలిపారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూడాలని అధికారులకు ఎమ్మెల్సీ సూచించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, తహసీల్దార్ మురళీకృష్ణ, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, రాములుగౌడ్, మంజుల, ప్రియ, ఉమావతి, నిర్మలమ్మ, ఏంపీవో మధుసూదనాచారి, ఏంఈవో సర్దార్, పశువైద్యాధికారి భానునాయక్, హెచ్ఈవో సుధీర్, సీడీపీవో సక్కుబాయి, డీఈలు తిరుపతిరెడ్డి, రవీంద్రప్రసాద్, ఏవో శ్రీలత, ఏఈలు పరమేశ్, నరేందర్, శ్రావ్య, వాగ్దేవి, రాజేశ్వరి, నిఖిల, సర్పంచ్లున్నారు.