మంచాల, డిసెంబర్ 21 : రంగారెడ్డి జిల్లాలోనే మారుమూల తండా అయిన పటేల్చెర్వు తండాకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించాలనే లక్ష్యం.. పట్టుదలతో చదువుతారు. 70 మందికిపైగా డాక్టర్లు, తహసీల్దార్, పోలీసులు, ఆర్టీసీ తదితర ప్రభుత్వ విభాగాల్లో స్థిరపడ్డారు. పటేల్చెర్వుతండా బంజారా సంస్కృతీ సంప్రదాయాలకు మారుపేరుగా నిలిచింది. 1011 జనాభా ఉండగా.. 900 మంది ఓటర్లు, 400 కుటుంబాలున్నాయి.
ఇక్కడి గిరిజనులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. తండాలో ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉండే నేడు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. ఉద్యోగం సాధించిన వారు తండాను మరిచిపోకుండా వారు సంపాదించిన దాంట్లో తండాలోని పిల్లల చదువుకోసం ఖర్చు చేస్తూ తమ అభిమానాన్ని చాటు కుంటున్నారు. తండా చిన్నదైనా ప్రభుత్వ ఉద్యో గాలను సాధించడంలో ముందున్నది. యువతీ యువకులు ప్రభుత్వ కొలువులు కొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతారు. ఇక్కడ ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారు ఉన్నారు.
కానిస్టేబుళ్లు -46 మంది, ఏఎస్ఐలు-నలుగురు, ప్రభుత్వ ఉపాధ్యాయు లు ఐదుగురు, డాక్టర్లు ముగ్గురు, ఆర్టీసీలో నలుగురు, తహసీల్దార్లో ఒకరు, ఎస్టీవోలో ఒకరు తమ విధులను నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూనే రాత్రి, ఖాళీ సమయాల్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనే పట్టుదలతో చదివా. చిన్నప్పటి నుంచే పోలీస్ కావాలని లక్ష్యంగా ఉండేది. దీంతో ప్రతిరోజూ ఖాళీ సమయంలో కష్టపడి చదివి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించా. కానిస్టేబుల్ నుంచి ప్రస్తుతం ఏఎస్ఐగా పదోన్నతి సాధించా. ప్రతి ఒక్కరూ లక్ష్యం తో ముందుకు సాగితే అన్నకున్నదానిని కచ్చితంగా సాధిస్తారు.
కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించా. పదోతరగతి వరకు ఇబ్రహీంపట్నంలో ఉన్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువగా.. ఇంటర్ను ఇబ్రహీంపట్నం జూనియర్ కళాశాలలో పూర్తి చేశా. కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల కాగానే కష్టపడి చదివి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించా. తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని మరువలేను.
-శంకర్నాయక్, ఏఎస్ఐ
ప్రటేల్చెర్వు తండాలో ఉన్న ప్రతి చిన్నారినీ ప్రభుత్వ పాఠశాలకెళ్లి చదువుకునేలా ప్రోత్సహిస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడంతో యువతీయువకులు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలనే లక్ష్యంతో చదివి జాబ్లను సాధించారు. తండాలో దాదాపుగా 70 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తుండడంతో చాలామంది వారిని ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదువుతున్నారు. విద్య మనిషిని ఉన్నత శిఖరాలను చేరుస్తుంది.