“వానాకాలం షురూ అయినప్పటికీ రాష్ట్రంలోకి రుతు పవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించాయి. ఇంత కాలం వేడెక్కి ఉన్న నగర వాతావరణం కాస్త చల్లబడింది. ఎండ వేడిమికి తాళలేక ఉసూరుమంటూ ఫ్యాన్, కూలర్, ఏసీల గాలి కోసం పరితపించిన జనం ఇప్పుడిప్పుడే వాటికి దూరం అవుతున్నారు. ఇటీవల రెండు మూడు రోజులుగా నైరుతి రుతు పవనాల నేపథ్యంలో కురుస్తున్న వాన జల్లులకు నగర వాతావరణం చల్లబడటంతో, విద్యుత్ పరికరాల వినియోగం తగ్గుముఖం పట్టింది. దీంతో నగరంలో విద్యుత్ వినియోగం కూడా తగ్గిపోయింది.”
సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే తెలంగాణ): నైరుతి రుతు పవనాలు ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి. జూన్ మొదటి వారంలోనే రావాల్సిన రుతు పవనాలు రాకపోవడంతో ఎండల తీవ్రత ఈ నెల 20, 21వ తేదీ వరకు మే నెలను తలపించింది. దీంతో గ్రేటర్ పరిధిలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో విద్యుత్ డిమాండు గణనీయంగా పెరిగింది. మండే ఎండల నుంచి ఉపశమనానికి ప్రజలు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లను ఎక్కువగా వినియోగించారు. చల్లదనం కోసం పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ను వినియోగించడంతో అత్యధిక డిమాండ్ జూన్ నెలలోనే నమోదైంది.
మే నెలలో రోజువారి సరాసరి విద్యుత్ వినియోగం 68 మిలియన్ యూనిట్లు ఉండగా, జూన్ నెలలో 20వ తేదీ వరకు 72 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. ఆ తర్వాత 21 నుంచి క్రమంగా రాష్ర్టానికి నైరుతి రుతు పవనాలు రావడంతో వర్షాలు కురుస్తుండటంతో క్రమంగా విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా తగ్గుతూ వచ్చిందని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు తెలిపారు. వర్షా కాలంలోనూ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని, నిరంతరం సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా గాలి, వానకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.