రంగారెడ్డి : మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ రాజుపై బదిలీ వేటు పడింది. మండల పరిధిలోని ఓ ఫాం హౌస్లో నిత్యం జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సీఐకి స్థానికులు ఫిర్యాదు చేశారు. సీఐ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. ఏసీపీ, డీసీపీలకు ఫిర్యాదు చేశారు. వీరు కూడా స్పందించకపోవడంతో.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కోర్టు ఆదేశాలతో మొయినాబాద్ పీఎస్లో ఫిర్యాదులను అధికారులు పరిశీలించగా, స్టేషన్లోనే నగదు లభించినట్లు సమాచారం. అంతే కాకుండా సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారిని పట్టించుకోకుండా బడా బాబులకు వత్తాసు పలుతున్నట్లు విచారణలో తేలినట్లు తెలిసింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం మొయినాబాద్ సీఐ రాజుపై బదిలీ వేటు పడింది. మొయినాబాద్ సీఐగా రాజు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు రావడంతోనే ఉన్నతాధికారులు క్షుణ్నంగా దర్యాప్తు చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.