మొయినాబాద్ : పూల మార్కెట్కు ఓ టాటా ఏసీఈలో పూలను మార్కెట్కు తరలిస్తుండగా డ్రైవర్ అజాగ్రత్తతో అతివేగంగా నడపటంతో ఆటో బోల్తాపడింది. ఈ సంఘటన మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామం గేట్ వద్ద చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పీరంపల్లి గ్రామానికి చెందిన పూల రైతులు ప్రతి రోజు హైదరాబాద్లోని గుడిమల్కా పూర్లో ఉన్న పూలమార్కెట్కు తరలిస్తారు. రోజు మాదిరిగానే బుధవారం కురువ యాదగిరి టాటా ఏసీఈలో శివకుమార్, చంద్రశేఖర్, బాల్రాజు, రామస్వామి, రవీందర్రెడ్డి, రంగారెడ్డి, గోపాల్, రంచంద్రయ్య, హరీశ్వర్రెడ్డి, ముత్యంరెడ్డి, మల్లయ్య, బందయ్య, శ్రీనివాస్, పాండురంగారెడ్డి, శశీధర్రెడ్డి పూలను తీసుకుని టాటా ఏసీఈ ఆటోలో పూల మార్కెట్కు వెళ్తున్నారు. పూలను ట్రాలీ నిండ ఎక్కించుకోవడంతో పాటు రైతులను ట్రాలీ వెనుకాల డోర్పైన కూర్చోబెట్టాడు.
అయితే డ్రైవర్ యాదగిరి అతివేగంగా, అజాగ్రత్తతో వాహనం నడపటంతో మొయినాబాద్ మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామ గేట్ వద్దకు రాగానే ట్రాలీ బోల్తాపడింది. దీంతో కొందరు రైతులు రోడ్డు మీద పడిపోగా, కొందరు ఆటోలోనే పూల సంచుల మధ్య ఇరుక్కుపోయారు. దీంతో కొందరికి తీవ్ర గాయాలు కాగా కొందరికీ స్వల్పగాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.