ఆదిబట్ల, జూన్ 26: తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దపీట వేసింది. ప్రతి మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్ భవన సముదాయాల నిర్మాణం చేపడుతున్నది. మున్సిపాలిటీ ప్రజల సౌకర్యార్థం ఒకే దగ్గర అన్ని వసతులతో కూడిన మోడల్ మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. అందులో భాగంగానే ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన మోడల్ మార్కెట్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి.
ప్రభుత్వం నిర్మిస్తున్న మోడల్ మార్కెట్కు ఆదిబట్ల మున్సిపాలిటీ కేంద్రంలోని కొంగరకలాన్కు వెళ్లే దారిలో సర్వే నంబర్ 442లో రెండెకరాల స్థలం కేటాయించింది. రూ.1.5 నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఈ మోడల్ మార్కెట్లో మాంసం, కూరగాయలు, పూలు, పండ్లు అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించారు. ప్రతి దానికి వేర్వేరుగా దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు.
చిరు వ్యాపారులకు ఉపాధి
ఆదిబట్ల మున్సిపాలిటీలో మోడల్ మార్కెట్ నిర్మాణం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 200 నుంచి 400 మంది చిరువ్యాపారులకు ఉపాధి లభించనుంది. మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో నిర్మాణ పనులు చేపడుతున్నారు. ప్రజారోగ్య శాఖ, ప్రభుత్వం అందించే ప్రత్యేక నిధులతో మార్కెట్ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఆదిబట్లతో పాటు కొంగరకలాన్, రావిరాల, బొంగుళూరు గ్రామాలకు త్వరలోనే ఈ దుకాణ సముదాయం అందుబాటులోకి రానుంది.
అన్ని సరుకులు ఒకేచోట
పట్టణ ప్రజలకు అన్ని రకాల సరుకులు ఒకేచోట లభ్యమయ్యేలా మోడల్ మార్కెట్ను నిర్మిస్తున్నాం. సమీకృత మార్కెట్ ఇళ్ల మధ్య ఉంటే ఇబ్బందులు తలెత్తుతాయని గ్రామానికి కొద్ది దూరంలో నిర్మాణం చేపట్టాం. ఇక్కడ దాదాపు అన్ని రకాల వస్తువులు, సరుకులు లభిస్తాయి. పనులు పూర్తికాగానే షటర్లను మంజూరు చేస్తాం.
– అమరేందర్రెడ్డి, ఆదిబట్ల కమిషనర్
త్వరలో అందుబాటులోకి..
ఆదిబట్ల మున్సిపాలిటీలో మోడల్ మార్కెట్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. దసరా, దీపావళీ వరకు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తున్నాం.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే