వికారాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : బీసీ ఉద్యమంలో వికారాబాద్ అగ్రస్థానంలో ఉండాలని, బీసీల ఐక్యతకు ఇక్కడి నుంచే నాంది పలకాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని నర్సింగ్ ఫంక్షన్హాల్లో బీసీ హక్కుల సాధన కోసం యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీసుకువచ్చి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు నిర్ణయాధికారం వచ్చేవరకు పోరాడుదామన్నారు. ఐక్యతతో ఉంటేనే బీసీలు హక్కులు సాధిస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ చేయాలన్నారు. నేటి నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకంగా బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లను కేటాయించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా 23,973 మంది బీసీలు సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు అవుతారన్నారు. దశాబ్దాల క్రితం చేపట్టిన కులగణనలో 4300లకుపైగా కులాలున్నాయని లెక్కతేల్చారని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలో 2400 కులాలున్నాయని చెబుతున్నదన్నారు. అసలు ఎన్ని కులాలున్నాయనేది స్పష్టత లేదని, తప్పనిసరిగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. పులులు, పిట్టలు, నెమళ్లను లెక్కపెడుతున్నారు కానీ మనుషులను లెక్కపెట్టడం లేదని, తక్షణమే బీసీ కులగణన ప్రక్రియను చేపట్టాలన్నారు. అదేవిధంగా మహాత్మజ్యోతిరావుఫూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించాలని కోరారు.
ఏప్రిల్ 11న జ్యోతిరావుఫూలే 111వ జయంతి అని, ఆలోగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపడుతున్నామన్నారు. దేశవ్యాప్తంగా బీసీ నేతలు వస్తున్నారని, ప్రతీ బీసీ బిడ్డ తరలిరావాలని పిలుపునిచ్చారు. 2018 నుంచి ఇప్పటివరకు యూపీఎస్సీ పరీక్షలో 4365 మంది ఉత్తీర్ణులుకాగా, వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు కేవలం 1195 మంది ఉన్నారన్నారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ ఉన్నా కేవలం 15.5 శాతం మందిని మాత్రమే ఎంపిక చేశారన్నారు. ఎస్సీలు 5 శాతం ఎస్టీలు 3 శాతం మాత్రమే ఎంపికయ్యారని తెలిపారు. వెనుకబడిన వర్గాల వారు కోల్పోతున్న రిజర్వేషన్లపై ఎవరూ మాట్లాడడంలేదని, బీసీ మేధావులు ఈ అంశంపై గళమెత్తాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రూ.26 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు కేవలం రూ.5 వేల కోట్లను మాత్రమే కేటాయించిందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కూడా కాపాడుకోలేకపోతున్నామని, చదువు, రాయు, సాధించు నినాదంతో బీసీ హక్కుల సాధనకు ముందుకు పోదామన్నారు. అదేవిధంగా ఓబీసీ అని చెప్పుకుంటున్న మోదీ తన మంత్రివర్గంలో బీసీ శాఖ మంత్రి లేకపోవడం శోచనీయమన్నారు. మరోవైపు 2006లో తెలంగాణ జాగృతి సంస్థను ప్రారంభించి అనేక సామాజిక, విద్యా, రాజకీయ అంశాలను తీసుకొని విజయం సాధించామని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపించామని, బతుకమ్మ పండుగను ప్రభుత్వం అధికారికంగా జరపడంలో జాగృతి కీలకమన్నారు. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష చేసి సాధించామన్నారు. మహిళా బిల్లు కోసం పోరాటం చేశామని, రాష్ట్రంలో 15 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించామని వెల్లడించారు.
బీసీల హక్కులు సాధించే వరకూ పోరాడుదాం..
మహాత్మజ్యోతిరావు ఫూలే ఆశయమైన బీసీల హక్కులను సాధించేవరకు పోరాడుదామని యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచంద్రరావు పిలుపునిచ్చారు. బీసీల్లోని 80-85 కులాలకు సంబంధించి కనీస ప్రాతినిథ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల్లోని అన్ని సంఘాలను కలుపుకొని ముందుకుపోతామన్నారు. సమాజానికి నాగరికత నేర్పిందే బీసీ కులాలన్నారు. ఏప్రిల్ 11 నాటికి ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. బీసీ ఉద్యమాన్ని పార్టీలకు అతీతంగా ముందుకు తీసుకుపోదామన్నారు. బీసీల హక్కుల సాధనతోపాటు ఫూలే విగ్రహ ఏర్పాటుకుగాను గ్రామాల్లో పోస్ట్ కార్డులు, గ్రామ పంచాయతీలు, మండలాలు, జడ్పీల్లో తీర్మానాలను చేయాలన్నారు.
మహాధర్నాను విజయవంతం చేద్దాం
బీసీల హక్కుల కోసం చేపడుతున్న మహాధర్నాకు అధిక సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేద్దామని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగేందర్గౌడ్ పిలుపునిచ్చారు. బీహార్లో కులగణన చేపడితే 63 శాతం ఉన్నారని లెక్కతేలిందని, తెలంగాణలోనూ 70 శాతం బీసీలుంటారన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అధిక శాతం ఉన్న బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.