రంగారెడ్డి, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : లోక్ సభ ఎన్నికలకు ముందే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొన్నది. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఎన్నికల కోడ్ సైతం ఇప్పటికే మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తుండగా.. స్థానిక సంస్థల్లో ఉన్న బలాబలాలను బట్టి బీఆర్ఎస్ గెలుపునకే అనుకూల అంశాలు ఎక్కువగా ఉన్నాయి.
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కశిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి, ఫరూఖ్నగర్, కేశంపేట, కొందుర్గు, కొత్తూరు, చౌదరిగూడెం, నందిగామ మండలాలు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ పరిధిలో ఉన్నాయి. ఈ మండలాల పరిధిలో 171 మంది ఓటర్లు ఉండగా.. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎక్స్ ఆఫీషియల్ సభ్యులు ఓటు వేయనున్నారు. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల నేతల్లోనూ మండలి పోరు టెన్షన్ నెలకొన్నది.
ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 26న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ఖరారు చేసింది. మార్చి 4న నోటిఫికేషన్ విడుదల కానున్నది. నామినేషన్ల దాఖలుగా మార్చి 11 గడువు కాగా.. 12న నామినేషన్ల పరిశీలన, 14 వరకు ఉప సంహరణ గడువును నిర్దే శించారు. 28న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. ఏప్రిల్ 4తో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానున్నది.
ప్రతి రెవెన్యూ డివిజన్కు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తున్నది. ఈక్రమంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని మండల పరిషత్తు కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. షెడ్యూల్ విడుదలతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఫ్లయింగ్ స్కాడ్, సర్వేలెన్స్ టీమ్లను ఏర్పాటు చేశారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ టీమ్లను సైతం ఏర్పాటు చేసి ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేసే దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
గతంలో జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కశిరెడ్డి నారాయణరెడ్డిని నిలబెట్టి ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ స్థానిక సంస్థల్లో మెజార్టీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. దీనికి తోడు అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్పై ప్రస్తుతం అన్నివర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్కు అనుకూలించే అంశాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.