షాబాద్, జనవరి 4 : భూసేకరణలో అర్హులైన రైతులందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామంలో సర్వేనంబర్ 311లోని ప్రభుత్వ భూమిని రైతుల నుంచి ఇటీవలే ప్రభుత్వం తీసుకున్నది. అందులో హెచ్ఎండీఏ వెంచర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రామ సర్పంచ్ పోనమోని కేతన రమేశ్యాదవ్ ఆధ్వర్యంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ కుమ్మరిగూడలో 311 సర్వేనంబర్లోని ప్రభుత్వ భూమిలో హెచ్ఎండీఏ వెంచర్ ఏర్పాటుకు రైతుల నుంచి అధికారులు భూసేకరణ చేపట్టినట్లు వివరించారు.
మొదటగా ఎకరాకు 500నుంచి 600 గజాల వరకు రైతులకు స్థలం ఇస్తామని అధికారులు చెప్పినట్లు తెలిపారు. అది మాకు సరిపోదని, ఇంకా ఎక్కువ కావాలని రైతులు తమ దృష్టికి తీసుకువచ్చిన్నట్లు చెప్పారు. దీంతో వెంటనే కలెక్టర్, ఆర్డీవోతో మాట్లాడి ఎకరాకు 750గజాల స్థలం రైతులకు ఇచ్చేవిధంగా ఒప్పించినట్లు తెలిపారు. కుమ్మరిగూడ గ్రామంలో ఇప్పటికే ఎంతో మందికి ప్రభుత్వ పథకాలు, గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు స్థలాన్ని 750 గజాలకు పెంచడం జరిగిందన్నారు. త్వరలో రైతులందరికీ పట్టా సర్థిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. గ్రామంలో అర్హులైన ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ పోనమోని కేతన, చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవ్రావు, తహసీల్దార్ సైదులుగౌడ్, సర్దార్నగర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నక్క శ్రీనివాస్గౌడ్, నాయకులు రమేశ్యాదవ్, గ్రామ రైతులు పాల్గొన్నారు.