బడంగ్పేట, ఫిబ్రవరి 24 : మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ను రూ.122 కోట్లతో అభివృద్ధి చేశామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎజెండాలో ఉన్న 46 అంశాలపై సభ్యులు చర్చించారు. ఎజెండాలో ఉన్న అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి రూ.75 కోట్ల ప్రత్యేక నిధులు తీసుకువచ్చామన్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా తేలేనివారు ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. పిచ్చి లెక్కలు చేస్తున్న వారి మాటలను ప్రజలు నమ్మకూడదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల మధ్యకు వచ్చి ప్రకటించిన నిధులను రద్దు చేయడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలపైన, మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పైన ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రద్దు చేసిన రూ.150 కోట్లను రిలీజ్ చేయాలన్నారు.
బడంగ్పేటకు రూ.50కోట్లు, మీర్పేటకు రూ.50 కోట్లు, జల్పల్లి మున్సిపాలిటీకి రూ.25 కోట్లు, తుక్కుగూడ మున్సిపాలిటీకి రూ.25 కోట్ల ఎస్జీఎఫ్ నిధులు తీసుకు వచ్చామన్నారు. నిధులు తీసుకు రాలేనివారు అవిశ్వాసాలు పెట్టి గందరగోళం చేయాలని చూస్తున్నారన్నారు. మీర్పేట అభివృద్ధికి మేయర్ దీర్గా దీప్లాల్ ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు. మీర్పేట పెద్ద చెరువు సుందరీకరణకు మరో కోటి రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు.
క్రీడా మైదానాల అభివృద్ధికి కోటి కేటాయించడం జరిగిందన్నారు. మూడు శ్మశాన వాటికలను అభివృద్ధి చేయిస్తామన్నారు. పట్టణ ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వానాలతో ఎంతో ప్రగతి సాధించామన్నారు. ఫుట్పాత్ల పైన నిర్మాణాలను, బోర్డులను తొలగించాలని ఆమె అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ చంద్రశేఖర్, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు. ఫిబ్రవరి 24 : ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని పులిమామిడిలో గల చీకటి వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్వహించిన స్వామివారి కల్యాణంలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. నిర్వాహకులు ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, మాజీ సర్పంచ్లు ఆనేగౌని అంజయ్యగౌడ్, ఆనేగౌని దేవీపాండుగౌడ్, మాజీ ఎంపీపీ ఆనేగౌని సంధ్య దామోదర్గౌడ్, ఎంపీటీసీ రాజమ్మ, యూత్ నాయకులు తాళ్ల కార్తీక్, బొక్క దీక్షిత్రెడ్డి, శేఖర్, భక్తులు పాల్గొన్నారు.