తాండూరు, జనవరి 31: తాండూరు మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న తెలిపారు. తాండూరు మున్సిపల్ సమావేశం బుధవారం సాదాసీదాగా జరిగింది. ఎజెండాలో 28 అంశాలను ప్రవేశ పెట్టగా 2 మినహా అన్ని అంశాలను ఆమోదించారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న అధ్యక్షతన, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కౌన్సిలర్లు వివిధ వార్డుల్లో నెలకొన్న సమస్యలు తెలుపుతూ.. పట్టణాభివృద్ధికి సలహాలు, సూచనలు చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటి సారి మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డిని మున్సిపల్ పాలక వర్గం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూరు మున్సిపల్ అభివృద్ధికి, ప్రజా సమస్యలను నెరవేర్చడానికి ఏమి చేయాలో ఆలోచించాలన్నారు. పార్టీలకు అతీంగా పాలన చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. నిలిచిన అభివృద్ధి పనులను సవ్యంగా సాగేందుకు సహకరించాలని కోరారు. కౌన్సిలర్లు ప్రజల్లో ఉంటు వార్డుల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని వెంటనే పరిస్కరించాలన్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో ఉన్న ప్రజలందరూ తమకు సమానమేనని తెలిపారు.
అధికారులు కూడా నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతతో విధులు నిర్వర్థించాలన్నారు. ఎక్కడ నిర్లక్ష్యం జరిగిన చర్యలు తప్పవన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి అందరం ఐక్యంగా ఉంటూ తాండూరు మున్సిపల్ అభివృద్ధికి కృషి చేద్ధామన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ షఫిఉల్లా, మేనేజర్ నరేందర్రెడ్డి, వైస్ చైర్పర్సన్ దీప, మున్సిపల్ ఫ్లోర్లీడర్లు, కౌన్సిలర్లు కోఫ్షన్ మెంబర్లు పాల్గొన్నారు.