పెద్దేముల్, జనవరి 17: అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ సర్వసభ్య సమావేశంలో సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను శ్రద్ధతో పరిష్కరించి.. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహార్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు అధికారులు శాఖల వారీగా నివేదికలను చదివి వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అధికారులు ప్రజలకు జవాబుదారీ తనంగా పనిచేయాలన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పెద్ద సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. సర్పంచులు, ఎంపీటీసీలు సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇసుక, మైనింగ్, ఇతర అక్రమ దందాలను ప్రోత్సహించేది లేదన్నారు. పార్టీలకతీతంగా మండల అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ నెల 29న మండలంలో జరిగే క్రీడలను విజయవంతం చేయాలన్నారు. రూ.100 కోట్లతో అనంతగిరి, కోట్పల్లి ప్రాజెక్టులను టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేస్తామన్నారు. సమావేశానికి ఆర్అండ్బీ శాఖ ఏఈల గైర్హాజర్పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ శాఖ అధికారులపై కలెక్టర్కు లెటర్ రాయాలని సూచించారు. అంతకుముందు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు వివిధ సమస్యలపై అధికారులను ప్రశ్నిస్తూ నిలదీశారు. అనంతరం నూతన ఎమ్మెల్యేను, ఆయా గ్రామాల సర్పంచులను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో ఎంపీపీ అనురాధారమేశ్, వైస్ఎంపీపీ మధులత, జడ్పీటీసీ ధారాసింగ్, తట్టేపల్లి పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మణెమ్మ, ఎంపీడీవో లక్ష్మప్ప, ఎమ్మార్వో కె.కిషన్, ఎంపీవో షేక్ సుష్మా, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ధన్సింగ్, ఎంపీటీసీ అంబరయ్య, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాండూరు రూరల్, జనవరి 17: పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆధార్ కేంద్రాన్ని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పోస్టాఆఫీస్లో ఒకే కేంద్రం ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాని, పాత మున్సి పల్ కార్యాలయంలో అదనంగా మూడు కేంద్రాలను ప్రారంభిం చామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.