తాండూరు, జనవరి 5 : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాండూరులోని 31, 32, 33 వార్డుల్లో ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి ఎమ్మెల్యే, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు నేరుగా దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పార్టీలకు, కులమతాలకతీతంగా నిజమైన లబ్ధిదారులకే ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు. ఇందులో ఎవరు నిష్పక్షపాతంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి పనులు చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
పూడూరు : ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆరు గ్యారెంటీల పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయని ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రజాపాలనలో భాగంగా పెద్ద ఉమ్మెంతాల్లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండు పథకాలు అమలయ్యాయని తెలిపారు. ఆయా పథకాలకై వస్తున్న దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిశీలించిన అనంతరం అర్హులకు పంపిణీ చేస్తామన్నారు. పూడూరు మండల పరిధిలో నేటి వరకు 13వేల దరఖాస్తులు వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీధర్గుప్తా ఉన్నారు.
కొడంగల్ : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులతో పాటు మండలంలోని రుద్రారం, పాటుమీదిపల్లి గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం సిద్ధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల పథకాలను అమలు చేస్తుందని, పథకాలను అందుకునేందుకు అర్హత కలిగిన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కదానికి దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తు ఫారాలను పరిశీలించడంలో ఆలస్యంతోపాటు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. ఆసరా పింఛన్, రైతు బంధు అందుకుంటున్న లబ్ధిదారులు అభయహస్తంలో దరఖాస్తు చేసుకోవద్దని, పథకం అందనివారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. సందేహాలుంటే అందుబాటులో ఉండే అధికారుల ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్లు వెంకటలక్ష్మి, బాలమణి, ఎంపీడీవో పాండు, తహసీల్దార్ విజయ్కుమార్, ఎంపీవో శ్రీనివాస్, మిషన్ భగరథ ఏఈ హుస్సేన్, రుద్రారం మాజీ సర్పంచ్ దామోదర్రెడ్డి పాల్గొన్నారు.
నవాబుపేట : ఐదు గ్యారెంటీలను అమలుజేసేందుకు ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నదని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నవాబుపేట మండల స్పెషలాఫీసర్ గోపాల్ తెలిపారు. రేపటితో ప్రభుత్వం నిర్ణయించిన గడువు ముగిసిపోనుందని.. అర్హులైనవారు త్వరగా దరఖాస్తులు తీసుకుని పథకాలను ఎంచుకుని అధికారులకు సమర్పించాలన్నారు. శుక్రవారం పులుమామిడిలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను గోపాల్ పరిశీలించి ప్రజలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి పామెన భీమ్భరత్ ప్రజలకు దరఖాస్తు ఫారాలు సరైన రీతిలో అందుతున్నాయా.. ఇంకా ఏమైనా ఇబ్బందులున్నాయా అని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా అందరికీ సాయం చేసేలా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం చించల్పేట గ్రామంలో జరుగుతున్న మహంకాళి జాతరలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు భీమ్భరత్. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీ తేజస్విని, విమల, ప్రభాకర్రెడ్డి, ఉప సర్పంచ్ సుధాకర్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు వెంకటయ్య, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు వెంకట్రెడ్డి, కొండల్యాదవ్, ఎక్బాల్, యాదగిరి, నర్సింహులు, ఎంపీడీవో సుమిత్రమ్మ, సెక్రటరీలు ఉన్నారు.
మర్పల్లి : ప్రభుత్వం అమలు చేయనున్న ఆరు గ్యారెంటీ పథకాలకు అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ గణేశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కోటమర్పల్లి, కొత్లాపూర్, నర్సాపూర్ గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహించి ప్రజాపాలన అభయహస్తం పథకాల దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కోటమర్పల్లిలో మాట్లాడుతూ.. ఎవరైనా దరఖాస్తు చేసుకోనివారు ఉంటే శనివారం ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తు ఫారాలను అందజేయాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారిణి అనిత, ఎంపీడీవో రాజమల్లయ్య, ఏపీఎం మధుకర్, ఏపీవో అంజిరెడ్డి, సర్పంచులు విజయలక్ష్మి, ప్రభాకర్, నాయకులు సుభాశ్యాదవ్, రవీందర్, కృష్ణారెడ్డి, నర్సింహారెడ్డి, ఖలీమొద్దీన్, దివాకర్, రాములుయాదవ్, ఫసియుద్దీన్, పాండునాయక్, జైహింద్రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు.
ధారూరు : అర్హులైనవారు ఆభయహస్తానికి దరఖాస్తు చేసుకోవాలని ధారూరు ఎంపీడీవో చెన్నారెడ్డి తెలిపారు. శుక్రవారం మండల పరిధి చింతకుంట, కుమ్మరిపల్లి, హరిదాస్పల్లి, మైలారం గ్రామాల్లో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చెన్నారెడ్డి, తహసీల్దార్ భువనేశ్వర్, ఎంపీవో షఫీఉల్లా, ఏపీవో సురేశ్కుమార్, మండల వ్యవసాయ అధికారి ఝాన్సీలక్ష్మి, ఏఈవో సంజీవ్ రాథోడ్, అధికారులు పాల్గొన్నారు.