తుర్కయాంజాల్, అక్టోబర్ 19 : ప్రజల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రకటించారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ బూత్ కన్వీనర్ల సమావేశం కమ్మగూడలోని రొక్కం సత్తిరెడ్డి గార్డెన్స్లో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు వేముల అమరేందర్రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం గతంలో కంటే ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
నియోజవర్గంలో రూ.2931 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా నాలుగు మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ప్రత్యేక నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ చైర్పర్సన్ సరైన రీతిలో మున్సిపాలిటీని అభివృద్ధి చేయలేకపోయారని అన్నారు. పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులను అందజేశామని చెప్పారు. మున్సిపాలిటీలో ప్రజలకు నీటి కష్టాలను తీర్చేందుకు రూ.96 కోట్లతో కృష్ణానీటి పనులను చేపట్టి ప్రతి ఇంటికీ మంచినీటిని అందజేశామన్నారు. సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని కచ్చితంగా అమలు చేస్తారని అన్నారు.
మంచిరెడ్డి కిషన్రెడ్డి గెలుపును ఎవరూ అడ్డుకోలేరని బీఆర్ఎస్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో కిషన్రెడ్డి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల గొడవ తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, కౌన్సిలర్లు కల్యాణ్ నాయక్, రవీందర్రెడ్డి, మల్లేశ్, జ్యోతి, కీర్తన, స్వాతి, సంగీత, నాయకులు కృష్ణాగౌడ్, కందాడి లక్ష్మారెడ్డి, సామ సంజీవరెడ్డి, ముత్యంరెడ్డి, చిన్నయ్య, అశోక్, వెంకటేశ్, విజయానంద్రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : బీఆర్ఎస్కు అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లలాంటివని, మరింత అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను గెలిపించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మండలం బీఆర్ఎస్ బూత్స్థాయి కార్యకర్తల సమావేశం పార్టీ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు అధ్యక్షతన ఇబ్రహీంపట్నంలోని శాస్ర్తాగార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గానికి రూ.2,931 కోట్లతో గ్రామాలు, మున్సిపాలిటీల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఇంటింటికీ తాగునీరు, విద్యుత్దీపాలు, కులసంఘాల భవనాలు, నూతన గ్రామ పంచాయతీల భవనాలు, గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ ఉన్న ప్రధాన రోడ్ల విస్తరణ, గ్రామాల్లో హరితహారం, వైకుంఠధామాలు, ప్రకృతి వనాలు, కంపోస్టు యార్డులతో పాటు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
ఉమ్మడి పాలనలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నిధులు సక్రమంగా రాకపోవటంతో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేని పరిస్థితి ఉండూదపి గుర్తు చేశారు. గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు చేసేవారన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతాన్ని నేడు జిల్లాలోనే అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపగలిగానని సంతోషం వ్యక్తం చేశారు. అడిగినన్ని నిధులు ఎప్పటికప్పుడూ మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటామన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ను మరింత భారీ మెజార్టీతో గెలిపించి, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవటం కోసం కార్యకర్తలు, నాయకులు కంకణ బద్ధులై పనిచేయాలని కోరారు.
గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ..ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతున్న నిరంతరం శ్రామికుడు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, సహకార సంఘం చైర్మన్లు బిట్ల వెంకట్రెడ్డి, మహేందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగ వెంకటేశ్, సర్పంచ్లు బల్వంత్రెడ్డి, హంసమ్మ, గీత, ఎంపీటీసీలు జ్యోతి, మంగ, టీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్, కోఆప్షన్ సభ్యుడు షరీఫ్, బీఆర్ఎస్ నాయకులు బుచ్చిరెడ్డి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
తలకొండపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మనతండాలో మన రాజ్యం నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని మిషన్ భగీరథ వైస్ చైర్మన్, జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ అన్నారు. గురువారం మండలంలోని తుమ్మలకుంటతండా, రోడ్డుమీదితండా, చీపునుంతల గ్రామ పంచాయతీల్లో ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్యాదవ్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమ్మరి శంకర్, రైతు సమన్వయసమితి మండల అధ్యక్షుడు నర్సింహ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, సర్పంచ్ లక్ష్మణ్నాయక్, నాయకులు కిషన్, వెంకటయ్య, రాములు, జగన్, మల్లేశ్, శ్రీనివాస్, హర్యానాయక్ పాల్గొన్నారు.
మంచాల : సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాల్లో గుబులు మొదలైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుకుడాల అంజిరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను చూసి రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. సమావేశంలో ఎంపీపీ నర్మద, బీఆర్ఎస్ నాయకులు బహదూర్, బుస్సు పుల్లారెడ్డి, సికిందర్రెడ్డి, దండేటికార్ రవి, వెంకటేశ్గౌడ్, బద్రినాథ్గుప్తా, నారి యాదయ్య, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
మాడ్గుల : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం తప్పదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మండలంలో గురువారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ కూడలి నుంచి వైకేపీ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలానికి 800 గృహలక్ష్మి, దళితబంధు 300 కుటుంబాలకు మంజూరైందని చెప్పారు.
మండలంలోని ప్రతి గ్రామానికీ బీటీ రోడ్లు వేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద తండాల బీటీ రోడ్లకు రూ.100 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే ఆరాట పడుతున్నాయని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ తిరుమల్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.