బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. భారీ ర్యాలీలు, సమావేశాలు, సభలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ శ్రేణులు గడపగడపకూ వెళ్లి అభ్యర్థుల తరఫున ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ సర్కారు తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. అభ్యర్థులకు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. ఏ ఊరిలో చూసినా బీఆర్ఎస్ ప్రచార హోరు.. చేరికల జోరే కనిపిస్తున్నది. ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేల సమక్షంలో స్థానిక కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ వెంటే ఉంటూ మరోసారి పట్టం కట్టేందుకు కృషి చేస్తామని చెబుతున్నారు. కాగా, బుధవారం ఇబ్రహీంపట్నం మండలంలోని తులేకలాన్, కప్పాడు, తుర్కగూడ, చర్లపటేల్గూడ, కర్ణంగూడ, పోచారం, ఉప్పరిగూడ, ఎలిమినేడు గ్రామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రచారం చేశారు. అలాగే చౌదరిగూడ మండలంలోని గుంజల్ పహాడ్, జాకారం, వాచ్చతండాల్లో షాద్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, నవాబుపేట మండలంలోని పులుమామిడి, లింగంపల్లి, గుల్లగూడల్లో ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రచారం చేశారు.
-న్యూస్నెట్వర్క్, (నమస్తే తెలంగాణ)
ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 15 : నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి మరోసారి ప్రగతికే పట్టం కట్టాలని, ప్రలోభాలకు లొంగవద్దని బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మంచిరెడ్డి కిషన్రెడ్డి బుధవారం ఇబ్రహీంపట్నం మండలంలోని తులేకలాన్, కప్పాడు, తుర్కగూడ, చర్లపటేల్గూడ, కర్ణంగూడ, పోచారం, ఉప్పరిగూడ, ఎలిమినేడు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే స్వగ్రామం ఎలిమినేడు గ్రామానికి సాయంత్రం ప్రచారం చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లపై మురుగు, మట్టిరోడ్లు, పెంటకుప్పలు దర్శనమిస్తుండేవని గుర్తు చేశారు. తాగటానికి సరిగ్గా నీరు కూడా దొరికేది కాదన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నదని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం నుంచి ఎలిమినేడు, పోచారం గ్రామాల మీదుగా బొంగుళూరు సాగర్ రహదారి వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావటంతో రవాణా సౌకర్యం మరింత సులభంగా మారిందన్నారు.
ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న బీఆర్ఎస్కు మరోసారి పట్టంకడితే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. బీఆర్ఎస్తోనే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. గ్రామాల్లో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. డప్పుచప్పుళ్లు, పటాకుల శబ్ధాలతో ఘనస్వాగతం పలికి గ్రామాల నుంచి మంచి మెజార్టీ అందిస్తామని నాయకులు, కార్యకర్తలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేశ్, వైస్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్రెడ్డి, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్రెడ్డి, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్, సర్పంచ్లు సామల హంసమ్మ, కత్తుల పవిత్ర, కంబాలపల్లి గీత, అశోక్రెడ్డి, యాదగిరి, ఎంపీటీసీ నాగమణి, ఉపసర్పంచ్లు మునీర్, నర్సింహారెడ్డి, నరేందర్రెడ్డి, సహకార సంఘం చైర్మన్ మహేందర్రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు యాదగిరి, జలందర్గౌడ్, సురేశ్, హరిప్రసాద్, గోవర్ధన్రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.
తుర్కయంజాల్ : ఇబ్రహీంపట్నం గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కందాడి సురేందర్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధి రాగన్నగూడలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం చేశారు. నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
యాచారం : మండలంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అన్ని గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వాడవాడలా తిరుగుతూ బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్, బీజేపీల మాయ మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధి మరో 60ఏండ్లు వెనకకు పోతుందని ప్రజలకు వివరించారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్రెడ్డిని నాలుగోసారి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జంగమ్మ, ఎంపీటీసీ సుమతమ్మ, సర్పంచ్ నర్సిరెడ్డి, నాయకులు శ్రీనువాస్, వెంకటేశ్, రమేశ్ తదితరులున్నారు.
పెద్దఅంబర్పేట : మరింత ప్రగతి కోసం మరోసారి మంచిరెడ్డి కిషన్రెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిడి విజయ్భాస్కర్రెడ్డి కోరారు. మున్సిపాలిటీ పరిధి తట్టిఅన్నారంలోని 16, 18 వార్డుల్లో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి మ్యానిఫెస్టో గురించి వివరించారు. మరోసారి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. గ్రామంలో అభివృద్ధి చేసిన ఘనత కిషన్రెడ్డికే దక్కుతుందని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పరశురాంనాయక్, మాజీ సర్పంచ్ రావుల గోపాల్గౌడ్, పార్టీ నాయకులు జాల సూరయ్య, సుక్క భిక్షపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.
మంచాల : ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న మంచిరెడ్డిని మరోసారి ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోడలు మౌనిక అన్నారు. మండల పరిధిలోని మంచాల, తాళ్లపల్లిగూడ, చిత్తాపూర్ గ్రామాల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలిపిన బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి కారు గుర్తుకు ఓటువేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, ఎంపీటీసీలు సుకన్య, నర్సింగ్ అనిత, సీనియర్ నాయకులు మంకు ఇందిర తదితరులు పాల్గొన్నారు.