పరిగి, జూన్ 13 : తెలంగాణలో అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పరిగిలోని ఎస్ గార్డెన్లో జరిగిన మహిళా సంక్షేమ దినోత్సవాలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. పేదింటి యువతుల వివాహానికి ప్రభుత్వం ద్వారా రూ.1,00,116 అందిస్తున్నదని తెలిపారు. పరిగి నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా 13వేల మందికి రూ.104కోట్లు అందించినట్లు ఎమ్మెల్యే వివరించారు. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు సర్కారు దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహిస్తూ ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగ పిల్లవాడు పుడితే రూ.12వేలతోపాటు కేసీఆర్ కిట్ అందించడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. పరిగి నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం రోజు రూ.4లక్షలు ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు తెలంగాణ ఏర్పాటు తర్వాత రూ.505కోట్లు రుణాలుగా ఇప్పించడం జరిగిందని, 435 సంఘాలకు రూ.10లక్షలు రుణం ఇప్పించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు ఏర్పాటుచేసిన స్టాల్స్ను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పరిశీలించారు. 227 స్వయం సహాయక సంఘాలకు రూ.18.50కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు కరణం అరవిందరావు, మల్లేశం, మాధవి, సత్యమ్మ, అనుసూజ, జడ్పీటీసీలు బి.హరిప్రియ, మలిపెద్ది మేఘమాల, రాందాస్నాయక్, శ్రీనివాస్రెడ్డి, నియోజకవర్గ నోడల్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సుధారాణి, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి ప్రియదర్శిని, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మేడిద రాజేందర్, డీఆర్డీఏ డీపీఎం రామ్మూర్తి, ఏపీఎంలు శ్రీనివాస్రెడ్డి, శోభ, బందెయ్య, సురేశ్, బాలకృష్ణ, అంగన్వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలతో మహిళలకు ఆత్మగౌరవం
కొడంగల్ : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే పట్న నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కొడంగల్లో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని, సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించి గౌరవించినట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేసి పేదింట్లో కల్యాణకాంతులు నింపుతున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాలు, మున్సిపల్లోని మహిళా సంఘాలు ప్రతి సంవత్సరం రూ.400కోట్ల టర్నోవర్ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం 518కోట్లు అదేవిధంగా శ్రీనిధి ద్వారా రూ.కోటీ 18లక్షలు రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు.
రూ.50లక్షలతో పట్టణ పరిధిలో అంగన్వాడీ భవన నిర్మాణం జరుగుతుందని, రెండు, మూడు నెలల్లో పూర్తి కానున్నట్లు పేర్కొన్నారు. 15 మహిళా సంఘం భవనాలకు త్వరలో శంకుస్థాపన చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. అంతకుముందు అంగన్వాడీ ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్, కుమ్మరులు తయారు చేసిన మట్టి పరికరాలను ఎమ్మెల్యే పరిశీలించి అభినందించారు. అనంతరం మహిళా సంఘాలకు మంజూరైన రుణాలకు సంబంధించి చెక్కులు, సబ్సిడీ పథకం కింద ఫ్యాన్లు, సంఘాలకు ప్రశంసాపత్రాలను ఎమ్మెల్యేతో పాటు పీడీ కృష్ణన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సుజాత, వైస్ చైర్పర్సన్ వాణిశ్రీ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి, బొంరాస్పేట, దౌల్తాబాద్ ఎంపీపీలు హేమీబాయి, విజయ్కుమార్, దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు మధుసూదన్రావు యాదవ్, వెంకట్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీడీవో పాండు, సీడీపీవో జయరాంలతో పాటు సెర్ప్, అంగన్వాడీ, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.
మహిళలకు అధిక ప్రాధాన్యత
తాండూరు రూరల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతనే మహిళలకు భద్రత పెరిగిందని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలో తెలంగాణ మహిళా సంక్షేమ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఐకేపీ సంఘాలకు ఎమ్మెల్యే తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్, తాండూర్టౌన్కు చెందిన పలు పొదుపు సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా అంగన్వాడీలో ఉత్తమ ప్రతిభను కనబర్చిన సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లను కూడా ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులకు భారంగా ఉండేదని, కేసీఆర్ ప్రభుత్వంలో ఆడపిల్ల పుడితే ఇంట్లో లక్ష్మి పుట్టిందనే భావన తల్లిదండ్రుల్లో కలుగుతున్నదన్నారు. అంగన్వాడీ మహిళలు, ఆశ వర్కర్లకు జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అశోక్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ దీప నర్సింహులు, పలువురు అధికారులు, మహిళలు ఉన్నారు.