మాడ్గుల, జూన్ 4 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని పకీరతండా పంచాయతీ పరిధిలోని బాలు తండాకు చెందిన 60మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆదివారం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో వారు చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మండలంలోని ప్రతి గ్రామానికి సాగు నీరు అందిస్తామన్నారు. ఇర్విన్ గ్రామాన్ని మండలంగా త్వరలో ప్రకటిస్తామన్నారు. భూములు కోల్పోయిన రైతులకు రూ.155 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
ఎస్టీ సబ్ ప్లాన్ కింద తండాల్లో బీటీ రోడ్ల కోసం రూ.100కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మండలంలోని ఇండ్లు లేని 500 మంది పేదలకు రూ.3లక్షలను అందజేస్తామన్నారు. మండలంలో అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు, రోడ్ల మరమ్మతుల కొరకు ప్రభుత్వం లక్షల నిధులను మంజూరు చేసిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదన్నారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే ఆరాట పడుతున్నాయని ఎద్దేవా చేశారు. కార్యకర్తలు సమన్వయంతో పని చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. బీజేపీ మాటలు విని మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్రెడ్డి, వైస్ ఎంపీపీ శంకర్నాయక్ పాల్గొన్నారు.