కల్వకుర్తి, నవంబర్ 21: తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, ప్రతి ఇంట్లో మన లబ్ధిదారులే ఉంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్యాదవ్ అన్నారు. ఇంటింటి ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలుసుకోవాలని, సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను వివరించి, కారు గుర్తుకు ఓటేయాలని కోరాలని సూచించారు. తొమ్మిది రోజుల పాటు అలుపెరుగకుండా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని కోరారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలోని బీఆర్ఎస్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని 22 వార్డులకు సంబంధించిన బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జైపాల్యాదవ్ బూత్ కమిటీల నాయకులకు దిశ నిర్దేశం చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లాలని, కారుగుర్తుకు ఓటు వేసేలా ఓటర్లను చైతన్యం చేయాలని చెప్పారు. ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన లబ్ధిదారులను మన ప్రచారంలో భాగస్వాములను చేసుకొని ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారనే విషయాలను ఓటర్లకు వివరించాలని సూచించారు. ఎమ్మెల్యేగా తనను మరోసారి ఆశీర్వదిస్తే, మరింత అభివృద్ధి చేస్తాననే విషయాలను ప్రచారంలో చెప్పాలని బూత్స్థాయి నాయకులకు వివరించారు. కాలనీల వారీగా కమిటీలు వేసుకుని ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న మోసపూరిత ప్రచారాలను తిప్పికొట్టాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షాహెద్, కౌన్సిలర్లు బోజిరెడ్డి తాహెర్, మనోహర్రెడ్డి, సైదులు, నగేశ్ పాల్గొన్నారు.
పథకాలు అర్థమయ్యేలా వివరించండి
పోలింగ్ బూత్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్యాదవ్ అన్నారు. మండల పోలింగ్ బూత్ కమిటీల సమావేశం పట్టణ సమీపంలో ఓ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్యాదవ్ మాట్లాడుతూ పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. ఎలక్షన్లో ప్రతి ఓటు కీలకమైందని, ఓటింగ్ శాతం పెరిగేలా బూత్ కమిటీలు చూడాలని చెప్పారు. కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అర్జున్రావు, నిట్ట నారాయణ ఉన్నారు.