వికారాబాద్, మార్చి 1(నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మున్సిపాలిటీల అధికారులు ఎలాంటి చొరవ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మొక్కలు నాటడం, సంరక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ఏటా కేటాయిస్తున్న గ్రీన్ బడ్జెట్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోని తాండూరు, పరిగి, కొడంగల్, వికారాబాద్ మున్సిపాలిటీల్లో గ్రీన్ బడ్జెట్ కింద ఏటా రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నారు. అధికారులు మొక్కలు నాటుతున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. రోడ్లకు ఇరువైపులా, పార్కుల్లో మొక్కలు నాటడం, మొక్కల సంరక్షణకు ట్రీ గార్డుల ఏర్పాటుకు గ్రీన్బడ్జెట్ నిధులను వెచ్చిస్తున్నట్లు లెక్కలు చూపుతున్నా ఎక్కడా మొక్కలు నాటిన దాఖలాలు లేవు.
అక్కడక్కడ నాటిన, ఇదివరకే ఉన్న మొక్కల సంరక్షణ చర్యలను విస్మరించడంతో ఎండలకు చనిపోతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నాలుగు మున్సిపాలిటీల్లో గ్రీన్ బడ్జెట్ నిధులు రూ.2.29 కోట్ల ఖర్చు చేసినట్లు లెక్కల్లో పొందుపర్చారు. వికారాబాద్ మున్సిపాలిటీలో రూ.58.09 లక్షలు, తాండూరు రూ.55.41 లక్షలు, పరిగి రూ.64 లక్షలు, కొడంగల్లో 52 లక్షల నిధులను పచ్చదనం పెంపునకు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో చాలావరకు నిధులను అధికారులు పక్కదారి పట్టించినట్లు తెలుస్తున్నది. ఈ నిధులపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపిస్తే అక్రమాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయం ఆయా మున్సిపాలిటీల ప్రజల నుంచి వ్యక్తమవుతున్నది.
మున్సిపాలిటీల్లో గ్రీన్ బడ్జెట్ కింద ఖర్చు చేస్తున్న నిధులు దుర్వినియోగమవుతున్నాయి. ప్రతి మున్సిపాలిటీలోనూ ఏటా రూ.50 లక్షలకుపైగా నిధులు ఖర్చు చేస్తుండగా, ఇందులో సగానికిపైగా నిధులను అధికారులు కాజేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వమే గ్రామానికో నర్సరీని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మొక్కలను పెంచుతున్నప్పటికీ.. ప్రైవేట్ నర్సరీల నుంచి వేలల్లో మొక్కలను కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపించడం పలు అనుమానాలకు బలం చేకూర్చుతున్నది. మొక్కల కొనుగోలు సాకుతో ప్రతి మున్సిపాలిటీలో రూ.5 లక్షల వరకు దుర్వినియోగం చేసినట్లు తెలుస్తున్నది.
పలు ప్రాంతాల్లో మొక్కలు నాటకముందే నాటినట్లు చెబుతూ డబ్బులు కాజేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా గతంలో నాటిన మొక్కలను ఈ బడ్జెట్ నిధులతోనే నాటినట్లు లెక్కలు చూపడం గమనార్హం. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతనూ మున్సిపాలిటీల అధికారులు విస్మరించారు. గ్రీన్ బడ్జెట్లో భాగంగా మొక్కలు నిత్యం నీరు, ట్రీగార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. దీంతో ఏటా నాటుతున్న మొక్కల్లో 20 శాతం కూడా బతకడం లేదు.
మొక్కలకు ట్రీ గార్డుల ఏర్పాటు విషయంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ట్రీ గార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు కేవలం లెక్కల్లోనే చూపుతున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లోనూ కనీసం పది మొక్కలకు కూడా ట్రీగార్డులు ఏర్పాటు చేయడం లేదని ప్రజలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ట్రీ గార్డుల ఏర్పాటుకుగాను ప్రతి మున్సిపాలిటీలో రూ.10 లక్షల వరకు ఖర్చు చూపడం గమనార్హం.