ఒకప్పుడు జీవనాధారంగా ఉన్న గొలుసుకట్టు చెరువులు క్రమేణ వైభవాన్ని కోల్పోయాయి. సమైక్య పాలకుల ఆదరణ సైతం కరువై అన్యాక్రాంతమయ్యాయి. అక్కడక్కడ ఉన్న చెరువులకు నీళ్లొచ్చినా నిల్వ ఉండే పరిస్థితి ఉండేది కాదు. మరమ్మతులకు నోచుకోని శిథిలమైన కట్టలకు గండ్లు పడి నీరు వృథాగా పోయేది. కానీ నేడు మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం వచ్చింది. ఏ ఊరు చెరువు చూసినా నిండా నీళ్లు.. ఒకటా, రెండా జిల్లాలోని అన్ని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ఫలితమే ఇది. చెరువుల పునరుద్ధరణతో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు బలమైన కట్టల నిర్మాణంతో గండ్లకు చెక్ పడింది. ఏడాదంతా చెరువులు, కుంటలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో పంటలకు సరిపడా సాగనీరు అందుతున్నది. జిల్లాలో రూ.132.95 కోట్ల వ్యయంతో 952 చెరువులకు ప్రభుత్వం జీవం పోసింది.
-రంగారెడ్డి, నవంబర్10(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబరు 10 (నమస్తే తెలంగాణ) : సాగునీటి రంగంలో మిషన్ కాకతీయ అద్భుత ఫలితాలను ఆవిష్కరించింది. నాటి పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన చిన్ననీటి వనరులకు పునర్జీవం పోసింది. వర్షపు జలాలతో చెరువులు నిండుగా మారి ఊరుకు జలకళను తీసుకొచ్చాయి. మండువేసవిలోనూ మత్తళ్లు దుంకగా.. భూగర్భ జలాలు పాతాళం నుంచి పైకి ఉబికిరావడంతో భూములన్నీ సస్యశ్యామలం అయ్యాయి. తద్వారా గ్రామీణ ఆర్థిక ప్రగతికి మళ్లీ పునాదులు పడి, వివిధ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో రూ.132.95కోట్ల వ్యయంతో చేపట్టిన మరమ్మతులతో బాగుపడ్డ 952 చెరువులు రెండు పంటలకు పుష్కలంగా జలాలను అందించి ఏండ్ల తరబడిగా దగాపడ్డ జిల్లా ప్రజల బతుకు చిత్రాన్ని పూర్తిగా మార్చివేశాయి.
జిల్లాలో ఒకప్పుడు జీవధారగా ఉన్న గొలుసుకట్టు చెరువులు వైభవాన్ని కోల్పోయాయి. వేల ఎకరాలకు సాగునీరు అందించిన వనరులు కళ తప్పి ఆదరణ కోల్పోయాయి. కొన్ని పూడుకుపోయాయి. ఇంకొన్ని ఆక్రమణల్లో కలిసిపోయాయి. మరికొన్ని ఉన్నా.. లేనట్టే అయ్యాయి. ఒకప్పుడు విశాలంగా ఉన్న చెరువులు కాస్తా.. కాలక్రమంలో నీటి గుంటల్లా మిగిలాయి. ఉన్న ఆ కొద్దిపాటి వనరుల్లోకి వర్షాకాలంలో నీళ్లొచ్చినా నిల్వ ఉండేది కొన్ని రోజులే. భారీ వరదలకు శిథిలమైన కట్టలకు ‘గండ్లు’ పడితే ఒక్క రోజులోనే చెరువులు ఖాళీ అయిన సందర్భాలు కోకొల్లలు. ఈ పరిస్థితుల్లో అంతరించిపోతున్న జల వనరులను మళ్లీ పునరుద్దరించాలన్న సదుద్దేశంతో చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో రంగారెడ్డి జిల్లాలోని చెరువుల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి.
కాకతీయ రాజుల పాలనలో కళకళలాడిన గొలుసు కట్టు చెరువులు దశాబ్దాల కాలం తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో మళ్లీ జలకళను సంతరించుకున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 999 చెరువులను మిషన్ కాకతీయ పథకం కింద పూర్వ వైభవం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. ఈ మేరకు నాలుగు విడుతల్లో ఈ పథకం కింద రూ.132.95కోట్ల వరకు నిధులను వెచ్చించి 956 చెరువులను బాగు చేసింది. కట్టలపై ఏపుగా పెరిగిన ముండ్ల పొదలను తొలగించారు. ఏండ్ల తరబడిగా మరమ్మతులకు నోచుకోని తూములకు మరమ్మతులు చేపట్టారు. చెరువు అంతర్భాగంలో పేరుకుపోయిన పూడికను తొలగించారు. గత ఏడాది ప్రభుత్వం రూ1.25కోట్లను వెచ్చించి 50 చెరువులకు మరమ్మతులు చేపట్టింది. దీంతో చెరువులు పటిష్టంగా మారి ఇటీవల భారీ వర్షాలకు సైతం చెక్కుచెదరలేదు.
కురిసిన ప్రతి వర్షపు చుక్క కాలువల ద్వారా చెరువులకు అటు నుంచి పంట పొలాలకు చేరుతోంది. దీంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. బోరు బావుల్లో ఎక్కడ చూసినా పాతాళ గంగ ఉబికి వస్తున్నది. ఈ ఏడాది జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. సాధారణ వర్షపాతానికి మించి వర్షం కురిసింది. దీంతో ‘మిషన్ కాకతీయ’తో పునర్జీవం పొందిన ఎన్నో చెరువులు జలాలతో కళకళలాడుతూ.. పంటల సాగుపై రైతులకు పూర్తి భరోసాను నింపుతున్నాయి. ప్రభుత్వం చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను ప్రతి ఏటా వదులుతుండడంతో మత్స్యకారులకు కూడా ‘మిషన్ కాకతీయ’ చెరువులు ఆదెరువు అవుతున్నాయి. పశు పక్షాదులకు కూడా నీరు అందుబాటులోకి వచ్చింది. మొత్తంగా ప్రజానీకానికి తాగు, సాగు నీటికి ఢోకా లేకుండా పోయింది.
‘మిషన్ కాకతీయ’తో చెరువులు, కుంటలు మరమ్మతులకు నోచుకున్నాయి. పూడికతీతతో పాటు చెరువు కట్టలను పటిష్టంగా పునర్నిర్మించారు. దీంతో భారీ వర్షాలు వచ్చినా కట్టలు చెక్కుచెదరలేదు. నీటి నిల్వలు పెరిగి భూగర్బజలాలు పెరిగాయి. ఒకప్పుడు వందల ఫీట్లు బోర్లు వేసినా నీళ్లు పడకపోయేది. ఇప్పుడు నూటాయాభై ఫీట్ల లోపే పుష్కలంగా నీళ్లు పడుతున్నాయి. ఇంతటి గొప్ప పథకానికి శ్రీకారం చుట్టి౪న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. చెరువు కట్టల బలోపేతం, పూడిక తీయడం, తూముల పునర్నిర్మాణం, అలుగుల మరమ్మతులు తదితర పనులు చేశారు. ‘మిషన్ కాకతీయ’ను పక్కాగా అమలు కావడం వల్ల సత్ఫలితాలు వచ్చాయి.
– బంటు కృష్ణ, గ్రామం రాఘవాపూర్, యాలాల
తెలంగాణలోని ప్రతి రైతును ఆర్థ్ధికంగా బలోపేతం చేయాలన్న సదుద్దేశంతో ‘మిషన్ కాకతీయ’ పథకానికి శ్రీకారం చుట్టారు. చెరువులు, కుంటలు బాగుపడి సాగు విస్తీర్ణమూ పెరిగింది. భూగర్భ జలాలు పెరుగడం వల్ల బోరుబావుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతున్న నీటి కార్యకర్త రాజేంద్ర సింగ్ ఈ సరస్సులను సందర్శించి 2016లో వరంగల్లోని ట్యాంక్బండ్పై తన పుట్టిన రోజు నిర్వహించుకోవడం ‘మిషన్ కాకతీయ’ గొప్పతనం దేశానికి అర్ధమైంది. తెలంగాణ కవులైన నందిని సిద్దారెడ్డి, ఏనుగు నరసింహా రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి వంటివారు తమ కవితలలో ‘మిషన్ కాకతీయ’ను కొనియాడారు.
– బోయిని కృష్ణ, గ్రామం రాఘవాపూర్, మండలం యాలాల
గత ప్రభుత్వాల హయాంలో చెరువులు, కుంటలను పట్టించుకోలేదు. ఏటేటా చెరువులు పూడుకుపోయి దీపంతల్లా తయారయ్యాయి. వర్షాలు వచ్చి నీళ్లు వచ్చినా కొద్ది రోజులకే ఎండిపోయేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు, కుంటలకు మహర్దశ వచ్చింది. పూడికతీత పనులు, కట్టల పునర్నిర్మాణం, తూముల మరమ్మతులు, కలుపుమొక్కల తొలగింపు తదితర పనులు చేపట్టారు. దీంతో సమృద్ధిగా కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఆయకట్టు భూములకు పుష్కలంగా సాగునీరు అందుతుండడంతో సాగు విస్తీర్ణమూ పెరిగింది. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
-శ్రీధర్గౌడ్, నాగారం, ధారూరు మండలం
‘మిషన్ కాకతీయ’తో చెరువులకు పూర్వవైభవం వచ్చింది. నీటి నిల్వ సామర్థ్యం పెరిగి ఆయకట్టు భూములు సస్యశ్యామలమయ్యాయి. దశాబ్దాలుగా మరమ్మతుకు నోచుకోని చెరువులు నేడు జలకళతో కళకళలాడుతున్నాయి. మా ఊరు పెద్ద చెరువు పూడికతీత పనులు చేశారు. ప్రస్తుతం చెరువులో నీరు పుష్కలంగా ఉన్నది. నీటినిల్వ సామర్థ్యం పెరుగడంతో బోరుబావుల్లో నీటిమట్టం పెరిగింది. రైతులు సాగునీటికి ఇబ్బందులు లేకుండా సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నాం. రైతుల శ్రేయస్సు కోసం అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– బోనాల వెంకటేశ్, చందనవెళ్లి(షాబాద్)
రైతుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారు. పెట్టుబడి సాయం, రైతుబీమా, 24గంటల కరెంట్తో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. దీంతో పాటు నిజాం కాలంలో నిర్మించిన చెరువులన్నీ ‘మిషన్ కాకతీయ’తో బాగుపడ్డాయి. షాబాద్ పహిల్వాన్ చెరువును మినీ ట్యాంక్ బండ్గా మార్చారు. చెరువు కింద ఆయకట్టులో బంగారు పంటలు పండుతున్నాయి. సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి రైతులంతా రుణపడి ఉంటారు.
– సయ్యద్ ఇబ్రహీం, షాబాద్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత చేపట్టిన ‘మిషన్కాకతీయ’తో చెరువులకు పూర్వవైభవం వచ్చింది. గతంలో చెరువుల్లో పూడిక తీత పనులు, ముల్ల చెట్లను తొలగించ పూడుకుపోయాయి. చెరువుల్లో నీళ్లు లేక, బోరుబావుల్లో నీళ్లు లేక సాగు సాగకపోయేది. ‘మిషన్ కాకతీయ’ కింద మా గ్రామంలోని అమ్రావాయి చెరువు పూడికతీతతో నేడు పుష్కలంగా నీరు ఉన్నది. చెరువులో చేపలు వేసి మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– యాదగిరి చీపునుంతల తలకొండపల్లి మండలం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం ద్వారా గ్రామాల్లో చెరువులకు మహర్దశ వచ్చింది. చెరువుల్లో పూడికతీత పనులు చేయడంతో పాటు తూములను మరమ్మతులు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురువడంతో సాగునీటికి ఇబ్బందులు తొలగాయి. చెరువు ఆయకట్టు కింద మూడు పంటలు పండుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో రైతులకు లాభం చేకూరింది.
– కొండయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ సాల్వీడ్, కులకచర్ల మండలం
ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం వల్ల చెరువులు, కుంటలు బాగుపడ్డాయి. చాలా సంవత్సరాలుగా చెరువులు, కుంటలు మరమ్మతులకు నోచుకోలేదు. పంట కాలువలు, చెరువు కట్టలు, తూములు కూడా అధ్వానంగా ఉండేవి. ‘మిషన్ కాకతీయ’తో పూడిక తీయడం, కట్టలు, కాలువలు, తూముల మరమ్మతు వంటి పనులు చేయడంతో నీటి వనరులు మెరుగయ్యాయి. ముఖ్యంగా పూడిక తీయడం వల్ల లోతు పెరిగి నీటినిల్వ సామర్థ్యం పెరిగి చివరి ఆయకట్టు వరకు నీరందుతున్నది. ‘మిషన్ కాకతీయ’ రైతులకు ఎంతో మేలు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-బాలకృష్టారెడ్డి, రైతు, ఏర్పుమళ్ల, బొంరాస్పేట మండలం
‘మిషన్ కాకతీయ’తో చెరువులు, కుంటల పూడికతీతతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి భూగర్భ జలాలు పెరిగాయి. చెరువు కట్టలు బాగుచేసి, కలుపు మొక్కలనూ తొలగించారు. బోరుబావు మోటర్లు తెంపులేకుండా నీళ్లు పోస్తున్నాయి. పూడిక తీసిన మట్టిని పొలంలో వేసుకోవడం వల్ల సారం పెరిగి పంట దిగుబడి పెరిగింది. గత పాలకులు పట్టించుకున్న పాపానపోలేదు. ప్రభుత్వాలు చిన్నచూపు చూడడంతో చెరువులు, కుంటలు కళ తప్పాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో చెరువులు జలకళ రావడంతో రైతులకు సాగునీటి సమస్య తీరిపోయింది. చెరువులు, కుంటలను బాగుచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు.
– జోగు వీరయ్య, కడ్తాల్ మండలం