ఆమనగల్లు, ఏప్రిల్ 18 : గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీఆర్డీఏ, మండల ప్రత్యేక అధికారి సూర్యారావు, మిషన్ భగీరథ అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఇన్చార్జి ఎంపీడీవో శ్రీకాంత్ అధ్యక్షతన తాగునీటి సరఫరా నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామాల్లో నీటి సమస్యను అడిగి తెలుసుకోవాలని, పైపు లైన్లు, తాగునీటి బోర్ల మరమ్మతులు చేపట్టాలని అన్నారు. సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాల్లో రైతుల వద్ద బోరుబావులను లీజుకు తీసుకుని తాగునీటిని సరఫరా చేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ లలిత, ఎంపీవో శ్రీలత, మిషన్ భగీరథ డీఈ సందీప్, ఏఈ శరత్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మంచాల : గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎంపీడీవో బాలశంకర్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎక్కడ నీటి సమస్య తలెత్తినా వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించనున్నట్లు చెప్పారు.
ఉపాధి హామీ పథకంలో పని కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కూలీకి పని కల్పించాలని కోరారు. ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కేవీవీ ప్రసాద్రావు, మండల ప్రత్యేకాధికారి శాంతిశ్రీ, వివిధ గ్రామాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.