షాబాద్, జనవరి 30 : పోడు భూములకు సంబంధించిన తుది దశ ప్రక్రియలను తక్షణమే పూర్తి చేయాలని, ఫిబ్రవరి మొదటి వారం నాటికి ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలను సిద్ధం చేసుకుని అన్ని విధాలుగా సమాయత్తం అయి ఉండాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు.
సోమవారం సాయంత్రం ఆయా జిల్లాల కలెక్టర్లతో పోడు భూములు, కంటి వెలుగు, మన ఊరు – మన బడి, ఆయిల్ పామ్ సాగు, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలపై సీఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. పోడు భూములకు సంబంధించిన సమీక్షలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. అటవీ ప్రాంత పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పోడు భూముల సమస్య పరిష్కారానికి సాహసోపేత నిర్ణయం తీసుకుందని మంత్రులు తెలిపారు. పోడు భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న అర్హులైన వారికి న్యాయం జరిగేలా చూడాలని, అదే సమయంలో ఇకపై అటవీ ప్రాంతాల ఆక్రమణ, చెట్ల నరికివేతకు ఏ మాత్రం ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని వారు ఆదేశించారు.
కంటి వెలుగు కార్యక్రమంపై నిశితంగా పర్యవేక్షణ చేయాలని.. ఆన్లైన్లో వివరాల నమోదులో తప్పులు, పొరపాట్లకు ఆస్కారం లేకుండా ప్రతి శనివారం డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి శిక్షణ అందించాలని సీఎస్ సూచించారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద పనులన్నీ పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1న మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రారంభోత్సవాలు జరిపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రారంభోత్సవాలకు ఎంపిక చేసిన బడుల్లో ఏ చిన్న పని కూడా అసంపూర్తిగా ఉండకుండా చూసుకోవాలని, పండుగ వాతావరణంలో ప్రారంభోత్సవాలు జరగాలని సీఎస్ శాంతికుమారి, మంత్రులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 70,795 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే 38 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని, ప్రారంభానికి సిద్ధంగా ఉండి.. పెండింగ్లో ఉన్న పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు, జిల్లా అటవీశాఖ అధికారి, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి రామేశ్వరిదేవి, అధికారులు పాల్గొన్నారు.
అర్హులకు ఫిబ్రవరిలో పోడు భూముల పట్టాల పంపిణీ
కోట్పల్లి : అర్హులకు ఫిబ్రవరిలో పోడు భూముల పట్టాల పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రులు సత్యవతిరాథోడ్, ఇంద్రకరణ్రెడ్డి, సీఎస్ శాంతికుమారి తెలిపారు. సీఎస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా కలెక్టర్లు చూడాలన్నారు. గ్రామసభల తీర్మానాలు, ఎస్డీఎల్సీ మధ్య ఉన్న వ్యత్యాసంపై కలెక్టర్లు సమీక్షించాలని సూచించారు. ఫిబ్రవరి 6 నాటికి పోడు భూముల ప్రింటింగ్లను పూర్తి చేసి సీఎం ప్రకటించే తేదీ నుంచి పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ నిఖిల, అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, రెవెన్యూ అధికారి అశోక్కుమార్, డీఎఫ్వో వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పాల్వన్కుమార్, విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చక్రపాణి, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.