ఇబ్రహీంపట్నం, ఆగస్టు 14 : 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో త్యాగధనుల బలిదానాలు, మరెందరో స్వాతంత్య్ర సమరయోధులు చూపిన చొరవతో నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నారు. వారి త్యాగాలను స్మరిస్తూ మహనీయుల వీరగాథలను రానున్న తరాలు గుర్తుంచుకునేలా స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా 15 రోజులపాటు రాష్ట్రంలో కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్లు చెప్పారు. శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించేలా చేసిన జాతిపిత మహాత్మాగాంధీ సినిమాను విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శిస్తున్నామని పేర్కొన్నారు. నాటి ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర భవిష్యత్తు తరాలకు, రేపటి పౌరులకు తెలిసేలా సీఎం కేసీఆర్ సూచనల మేరకు చిత్రం ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలతోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, మీడియా ప్రతినిధులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 14 : వర్షాలు పడుతున్నందున ప్రతిఒక్కరూ మలేరియా, డెంగీ వంటి విషజ్వరాలు ప్రబలకుండా సరైన జాగ్రత్తలు పాటించాలని విద్యాశాఖమంత్రి సబితారెడ్డి అన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10:10 గంటలకు పది నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఆదివారం మంత్రి సబితారెడ్డి నగరంలోని తమ ఇంట్లో నిలువ నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను శుభ్రం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.