భూ నిర్వాసితులకు తెలంగాణ సర్కార్ అండగా ఉంటుందని మంత్రులు పట్లోళ్ల సబితారెడ్డి, పట్నం మహేందర్రెడ్డి అన్నారు. షాబాద్ మండలంలోని సీతారాంపూర్ పారిశ్రామికవాడలో భూములు కోల్పోయిన 335 మంది కౌలు రైతులకు శనివారం చేవెళ్లలో జరిగిన కార్యక్రమంలో ఇండ్ల స్థలాల పట్టాలను రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. దేశం అబ్బురపడే విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు కొనసాగుతున్నాయన్నారు. పెట్టుబడులకు జిల్లా అనువైన ప్రాంతం కావడంతో దేశ, విదేశాలకు చెందిన పలు కార్పొరేట్ సంస్థలు తమ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు.
ఇప్పటికే అధిక సంఖ్యలో వెలిసిన పరిశ్రమలతో జిల్లా ఇండస్ట్రియల్ హబ్గా మారిందన్నారు. జిల్లాలోని మహేశ్వరం, చేవెళ్ల తదితర నియోజకవర్గాల్లో పారిశ్రామిక వాడలు ఏర్పాటవుతున్న తరుణంలో భూ నిర్వాహసితులకు ఎలాంటి నష్టం కలుగకుండా ప్రభుత్వం తగిన పరిహారాన్ని అందిస్తున్నదన్నారు. ఇందులో భాగంగానే సీతారాంపూర్లో టీఎస్ఐఐసీ సేకరించిన 1148 ఎకరాల భూమికి ఎకరాకు రూ.10.50లక్షల చొప్పున కౌలు రైతులు, దేవాదాయశాఖకు మొత్తంగా రూ.242 కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందన్నారు. అంతేకాకుండా భూ నిర్వాసితులకు ఎకరాకు 121 గజాల చొప్పున ఇండ్ల స్థలాలను సైతం అందిస్తున్నదని వెల్లడించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతున్నదన్నారు. ఫలితంగా ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయన్నారు.
-షాబాద్, సెప్టెంబర్ 30
షాబాద్, సెప్టెంబర్ 30 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శనివారం చేవెళ్లలో షాబాద్ మండలంలోని సీతారాంపూర్ పారిశ్రామికవాడలో భూములు కోల్పోయిన 335 మంది కౌలు రైతులకు ఇండ్ల స్థలాల పట్టాలను రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, షాబాద్, మొయినాబాద్ జడ్పీటీసీలు పట్నం అవినాశ్రెడ్డి, కాలె శ్రీకాంత్, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి తదితరులతో కలిసి మంత్రులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ.. పారిశ్రామిక, వ్యవసాయ, విద్య, వైద్య, తదితర అన్ని రంగాల్లో దేశం అబ్బరపడేలా తెలంగాణలో అభివృద్ధి సాగుతున్నదన్నారు.
పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అనువైన ప్రాంతం కాగా, రంగారెడ్డిజిల్లా పరిశ్రమల ఖిల్లాగా మారిందన్నారు. రంగారెడ్డిజిల్లాలోని మహేశ్వరం, చేవెళ్ల తదితర నియోజకవర్గాల్లో పారిశ్రామిక వాడలు ఏర్పాటవుతున్న తరుణంలో భూ నిర్వాసితులకు సైతం ప్రభుత్వం ఎలాంటి నష్టం కలుగకుండా వారికి నష్టపరిహారాన్ని అందిస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా సీతారాంపూర్లో టీఎస్ఐఐసీ సేకరించిన 1148 ఎకరాల భూముల పరిహారం కోసం ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున కౌలు రైతులకు, దేవాదాయ శాఖకు మొత్తంగా రూ.242 కోట్లను అందించనున్నట్లు వివరించారు.
దేవాదాయశాఖకు రూ.89 కోట్లను ఇప్పటికే చెల్లించగా, త్వరలో మరో రూ.31 కోట్లను అందించనున్నట్లు పేర్కొన్నారు. కౌలు రైతులకు వారి ఖాతాల్లో రూ.121 కోట్లు జమ చేశామని, వారికి ప్రస్తుతం ఎకరాకు 121 గజాల చొప్పున ఇండ్ల స్థలాలను అందిస్తున్నామని వెల్లడించారు. త్వరలో ఈ స్థలాలకు సంబంధించిన ప్లాట్లలో బీటీ రోడ్లు, విద్యుద్దీకరణ, పార్కులు, తాగునీటి సరఫరా లాంటి మౌలిక సదుపాయాలు కల్పించి పూర్తి స్థాయిలో ఇండ్ల నిర్మాణాలకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో షాబాద్ మండలంతో పాటు చేవెళ్ల నియోజకవర్గం ఊహించని రీతిలో అభివృద్ధి చెందడం ఖాయమని మంత్రులు స్పష్టం చేశారు.
ప్రపంచ దేశాలకు పాకిన షాబాద్ పేరు
చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ హయాంలో షాబాద్ పేరు ప్రపంచ దేశాలకు తెలిసొచ్చేలా తయారైందన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతున్నట్లు తెలిపారు. కంపెనీల ఏర్పాటు కోసం సీతారాంపూర్ దేవాదాయశాఖ భూమిని తీసుకున్న ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంతో పాటు వారికి ఇండ్ల స్థలాలు అందిస్తున్నని ఆయన తెలిపారు.
పేద ప్రజలకు అండగా..
జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తున్నదన్నారు. పరిశ్రమల ఏర్పాటులో భూములు కోల్పోయిన సీతారాంపూర్ రైతులకు రూ.కోట్ల విలువ చేసే ఇండ్ల స్థలాలు అందించడం గొప్ప పరిణామమని పేర్కొన్నారు. అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తున్నదని అనితారెడ్డి తెలిపారు.
అభివృద్ధి పథంలో చేవెళ్ల నియోజకవర్గం
ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. నగరానికి దగ్గర్లో ఉన్న చేవెళ్ల నియోజకవర్గంలో పెద్ద పెద్ద కంపెనీలు రావడంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. షాబాద్ మండలంలోని చందనవెళ్లి, హైతాబాద్, సీతారాంపూర్, శంకర్పల్లి మండలం కొండకల్లో ఏర్పాటు చేస్తున్న వివిధ కంపెనీల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ చిన్నప్పలనాయుడు, డిప్యూటీ తహసీల్దార్ మధు, బీఆర్ఎస్ చేవెళ్ల మండలాధ్యక్షుడు ప్రభాకర్, షాబాద్ మండల అధ్యక్షుడు నర్సింగరావు, సీతారాంపూర్ సర్పంచ్ పాండురంగారెడ్డి, ఉప సర్పంచ్ సందీప్, అధికారులు, గ్రామస్తులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.