కందుకూరు, నవంబర్ 17 : మేడ్చల్లో చెల్లని రూపాయి.. మహేశ్వరంలో చెల్లుతుందా అని మంత్రి, బీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ అభ్యర్థి సబితారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని మాదాపూర్, కొలనుగూడ, గుమ్మడవెల్లి, ఆకులమైలారం, మీర్ఖాన్పేట్, బేగరికంచె, అన్నోజిగూడ, కటికపల్లి, గూడూరు గ్రామాల్లో పర్యటించి ప్రసంగించారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు, పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనాలో కనిపించని నేతలు, కష్టాల్లో కనబడని నేతలు.. నేడు మీ ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నాయకుడు తాండూరులో సీటు అడిగితే మహేశ్వరంలో ఇచ్చారని.. ఇష్టం లేకున్నా పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారన్నారు.
రేపు ఎన్నికలయ్యాక వీళ్లు కనిపిస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులిరువురు రియల్ ఎస్టేల్ వ్యాపారులని… నేను రియల్ లీడర్నన్నారు. మీకు రియల్ వ్యాపారులు కావాలా.. రియల్ లీడరు కావాలా అని ప్రజలను అడుగగా మీరే కావాలని ప్రజలు సమాధానం చెప్పారు. డబ్బుల సంచులు నెత్తిన పెట్టుకొని వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థికి మహేశ్వరంలో ఓటమి తప్పదని పేర్కొన్నారు. గతంలో పట్లోళ్ల కుటుంబంపై రెండు సార్లు పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన కేఎల్ఆర్ మూడోసారి మహేశ్వరంలో తనపై పోటీకి వచ్చారన్నారు. ప్రజలు తన వెంటే ఉన్నారని.. కేఎల్ఆర్ను చిత్తుగా ఓడించి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల చాలా కీలకమైనవని.. ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి సూచించారు. మొసలి కన్నీరు కార్చే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. మంత్రి ప్రజలను పింఛన్లు వస్తున్నాయా అని ప్రశ్నించగా.. వస్తున్నాయి, కేసీఆర్ ఉండగా తమకు ఇబ్బంది లేదన్నారు. తమ ఓటును కారు గుర్తుకే వేస్తామని చెప్పారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్రెడ్డి. పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, వైస్ చైర్మన్ విజేందర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి. సీనియర్ నాయకులు, సర్పంచ్లు, మహిళా అధ్యక్షురాలు ఇందిరమ్మ, ఎంపీటీసీలు, యూత్ నాయకులు, ఆయా గ్రామాల పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులున్నారు.