రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెలు పచ్చదనం, అభివృద్ధిలో మెరుస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం పూడూరు మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో జరిగిన పల్లెప్రగతి దినోత్సవానికి జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మహేశ్రెడ్డితో కలిసి హాజరై ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి గ్రామంలో నూతన పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసి సోలార్ లైటింగ్, పల్లె ప్రకృతివనం, క్రీడాప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఊహించని రీతిలో అభివృద్ధి జరిగిందన్నారు.
పల్లెలు పచ్చదనం, ప్రగతిలో దేశంలోనే ముందుండటంతో జాతీయ స్థాయి అవార్డులు కూడా మన గ్రామాలకు వరించాయన్నారు. ప్రతి ఒక్కరూ 2014కు ముందు జరిగిన అభివృద్ధిని.. తర్వాత జరిగిన ప్రగతిని బేరిజు వేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించి ఆదుకుంటున్నారని గుర్తు చేశారు. ఐదు వందల జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పల్లెప్రగతి సంబురాలు అంబరాన్నంటాయి. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో జరిగిన వేడుకలో ఎంపీ రంజిత్రెడ్డి, మొయినాబాద్లో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి పాల్గొనగా.. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం గురించి ప్రజలకు వివరించారు. కొన్ని గ్రామాల్లో ప్రజలు వనభోజనాలు చేయగా.. మరి కొన్ని గ్రామాల్లో ఆలయాల చుట్టూ బోనాలు తీశారు. పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
పూడూరు, జూన్ 15 : దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామంలో మహిళలు బోనాలతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సబితారెడ్డి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసి, సోలార్ లైటింగ్, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణాలను జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మహేశ్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
గ్రామాలకు పలు జాతీయ అవార్డులు
అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో ఉహించని అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని తెలిపారు. ప్రతిఒక్కరూ 2014కు ముందు, తర్వాత పరిస్థితులను బేరీజు వేసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీల్లో చట్టాలను మార్చి గ్రామాలు అభివృద్ధి చెందే దిశగా సీఎం కృషి చేశారని తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం పరిశుభ్రంగా ఉండడంతో గ్రామాలకు పలు జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 8వేలకు పైగా పంచాయతీలుండగా, నూతనంగా 4వేల గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి మొత్తం 12,760 గ్రామపంచాయతీలకు కార్యదర్శులను నియమించి ప్రజలకు పంచాయతీ వ్యవస్థను మరింత దగ్గరగా చేశారని మంత్రి పేర్కొన్నారు.
మీర్జాపూర్ గ్రామాభివృద్ధికి రూ.కోటి
మీర్జాపూర్ గ్రామానికి గతంలో రూ.60లక్షలు రాగా 2014 తర్వాత గ్రామాభివృద్ధికి రూ.కోటి వచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో 19వేల ప్రకృతి వనాలను రూ.750 కోట్లు ఖర్చు చేసి నిర్మించినట్లు వివరించారు. హరితహారంలో భాగంగా ఇప్పటివరకు 230 కోట్ల మొక్కలు నాటగా.. తెలంగాణలో 7 శాతం పచ్చదనం పెరిగిందన్నారు. గతంలో సరైన విద్యుత్ సరఫరా లేక నానా తిప్పలు పడేవారని.. ట్రాన్స్ఫార్మర్ పాడైపోతే రైతులు చందాలు వేసుకునే దుస్థితి ఉండేదన్నారు. ప్రస్తుతం 24గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నదన్నారు. రైతుల కోసం కేసీఆర్ రైతు బీమా, రైతు బంధు, ఉచితంగా 24 గంటల విద్యుత్, నాణ్యమైన విత్తనాలు అందజేస్తున్నారని తెలిపారు. వేసవి కాలం వచ్చిందంటే మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చేవారని.. తెలంగాణ వచ్చాక మిషన్ భగీరథతో మంచినీటి కష్టాలు తీరాయన్నారు.
రూ.7వేల కోట్లతో మన ఊరు మన బడి
గ్రామాల్లోని నిరుపేద విద్యార్థులు నాణ్యమైన విద్య నేర్చుకునేందుకు రూ.7వేల కోట్లతో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ 1000 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయగా సుమారు 5లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తారన్నారు. పాలమూరు ప్రాజెక్టు పనులు జరుగకుండా ప్రతిపక్ష పార్టీలే అడ్డుపడ్డాయన్నారు. మీర్జాపూర్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన శేరిగూడ గ్రామానికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి రూ.30లక్షలు మంజూరు చేస్తునట్లు మంత్రి పేర్కొన్నారు. గతంలో కంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రతిఒక్కరూ చర్చించాలని మంత్రి తెలిపారు.
గ్రామపంచాయతీల్లో గణనీయ అభివృద్ధి
జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు. సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మీర్జాపూర్ సర్పంచ్ కోరిక మేరకు పలు అభివృద్ధి పనుల కోసం రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలను నాటి కేరళ రాష్ట్రం మాదిరిగా పచ్చదనం చేయాలన్నారు. వర్షపు నీరు వృథా పోకుండా ఇంకుడుగుంతలను తవ్వాలని ఆమె సూచించారు.
అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలి
ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను ఏర్పాటు చేసి ప్రతిరోజూ గ్రామాలను శుభ్రంగా ఉంచేలా పారిశుధ్య కార్మికులను నియమించారన్నారు. గతంలో గ్రామపంచాయతీలు చెత్తాచెదారంతో నిండిపోయేవని.. సీఎం శాశ్వత చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. మీర్జాపూర్ గ్రామపంచాయతీకి నూతన భవన నిర్మాణానికి రూ.20లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను పార్టీ నాయకులు ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే తెలిపారు.
అభివృద్ధిపై చర్చించాల్సిన అవసరముంది
కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామపంచాయతీల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నదన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గత తొమ్మిది సంవత్సరాలుగా జిల్లాలో జరిగిన అభివృద్ధి అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాకు 216 గ్రామపంచాయతీలు ఏర్పడగా.. మొత్తం 580 గ్రామపంచాయతీలున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పాడుబడిన ఇండ్లు, బావులను పూడ్చి గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేసిందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్ రవి, ఎంపీటీసీ సురేందర్, పరిగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజారుద్దీన్, డీఆర్డీవో క్రిష్ణన్, డీపీవో తరుణ్, ఆయా శాఖల అధికారులు, సర్పంచ్లు ఉన్నారు.
చేవెళ్లటౌన్ : గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం చేవెళ్లలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో పల్లె ప్రగతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ నుంచి పల్లె ప్రగతి వరకు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి వనభోజనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు గ్రామపంచాయతీకి ఒక ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, నర్సరీ, ఇంటింటికీ ఆరు మొక్కలు, ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి గ్రామాల రూపురేఖలను మార్చిందని తెలిపారు. 24 గంటల కరెంటును ప్రభుత్వం సరఫరా చేస్తున్నదన్నారు. మిషన్ కాకతీయతో చెరువులు, కుంటల్లో పూడిక తీయడంతో చెరువులు, కుంటలు నిండి బావులు, బోర్లల్లో నీటి మట్టం పెరిగిందన్నారు. పల్లెలు అభివృద్ధి చెందినందుకు మనమందరం సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరముందన్నారు. గ్రామాల అభివృద్ధికి కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారని ఎంపీ చెప్పారు.
మున్సిపాలిటీగా చేవెళ్ల
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేవెళ్లలోని పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రంజిత్రెడ్డి కీలక ప్రకటన చేశారు. చేవెళ్ల మున్సిపాలిటీగా అవతరించబోతుందని ప్రకటించారు. ఏఏ గ్రామాలు మున్సిపాలిటీలో కలువబోతున్నాయో ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి మాట్లాడుతామని వివరించారు. మున్సిపాలిటీతో చేవెళ్ల పట్టణం మరింత అభివృద్ధి చెందనుందని ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల నాయకులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు.
పల్లెల ప్రగతి కోసం నిరంతరం కృషి
ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ పల్లెల ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో నర్సరీలు పెంచడం, ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారన్నారు. గ్రామపంచాయతీలో రూ.3,31,64,560లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, చేవెళ్ల సర్పంచ్ శైలజ, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, నవాబుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్గౌడ్, ఎంపీటీసీ వసంతం, ఎంపీడీవో రాజ్కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, డీటీ రాజశేఖర్, ఉపసర్పంచ్ యాదయ్య, మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు, నాయకులు కృష్ణారెడ్డి, రవికాంత్రెడ్డి, శేఖర్ ఉన్నారు.
మొయినాబాద్ : పల్లెల్లో పచ్చదనం.. పరిశుభ్రతలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండల పరిధిలోని చిలుకూరు గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో పల్లె ప్రకృతి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్తో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో పల్లె ప్రకృతి వనం వద్ద వన భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పల్లెలు పచ్చదనంతో ఉండాలని తెలంగాణకు హరితహారం, పల్లెలు పరిశుభ్రంగా ఉండాలని పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకొచ్చారని చెప్పారు. పల్లె ప్రగతిలో భాగంగా వైకుంఠధామంతోపాటు పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు వంటి పలు కార్యక్రమాలను చేపట్టారన్నారు. తెలంగాణ పచ్చదనం.. పరిశుభ్రతలో ప్రగతి సాధించినట్లుగా కేంద్ర ప్రభుత్వం సుమారు 30 అవార్డులను రాష్ర్టానికి ఇచ్చిందని చెప్పారు. దీని వెనుక ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశుధ్య కార్మికుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నక్షత్రం, ఆర్డీవో వేణుమాధవ్రావు, ఎంపీడీవో సంధ్య, కార్యదర్శి వెంకటేశ్, మాజీ ఉపసర్పంచ్ ఆండ్రూ పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ రీడింగ్ హాల్ ప్రారంభం
వికారాబాద్, జూన్ 15 : తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రంథాలయ శాఖలో భారీ సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి సబితారెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా గ్రంథాలయంలో నూతనంగా నిర్మించిన రీడింగ్ హాల్ను జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్రెడ్డి, రోహిత్రెడ్డితో కలిసి ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్కుమార్గౌడ్ ముఖ్య అతిథులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో వికారాబాద్ కేంద్రంగా ఉన్న జిల్లా గ్రంథాలయంలో ఆధునిక సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోటీ పరీక్షల అభ్యర్థులకు గ్రంథాలయాల్లో మెటీరియల్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో 10వేల రీడింగ్ కార్నర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ నెల 20న విద్యా దినోత్సవం రోజున ప్రారంభిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పంచాయతీలు ముందుకు వస్తే రీడింగ్ రూమ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
చిన్నారులు, విద్యార్థులు, యువత, సీనియర్ సీటిజన్ల కోసం గ్రంథాలయాల్లో పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని అతిథి గృహం సమీపంలో ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం పనులను మంత్రి పరిశీలించారు. ఈ నెల 22న జరిగే దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజున ఆవిష్కరించనున్నారు. త్వరితగిన పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, ఎంపీపీ చంద్రకళ, ఆర్డీవో విజయకుమారి, డీఈవో రేణుకాదేవి, గ్రంథాలయాల కార్యదర్శి సురేశ్బాబు, తహసీల్దార్ రాజేందర్రెడ్డి, ఎంఈవో బాబూసింగ్ పాల్గొన్నారు.
అధ్యాపకులను నియమించాలని మంత్రికి వినతిపత్రం
వికారాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాలలో అధ్యాపకులను నియమించాలని మంత్రికి బీఈడీ చదువుతున్న ఛాత్రోపాధ్యాయులు వినతిపత్రాన్ని సమర్పించారు. అధ్యాపకులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు.