ఢిల్లీ పార్టీలు మన రాష్ర్టానికి అవసరమా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం కందుకూరు మండలంలోని సార్లరావులపల్లి తండాలో రూ.2.50 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవనం, ఫంక్షన్హాళ్లకు మంత్రి సబితారెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అక్కడే మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అదేవిధంగా చేవెళ్ల మండలంలోని మలాపూర్ గ్రామంలో బీటీ, సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, మొయినాబాద్ మండలంలోని సురంగల్లో రూ.25 లక్షలతో వేసిన సీసీ రోడ్డు..
చేవెళ్ల మండల కేంద్రంలో మినీ స్పోర్ట్స్ స్టేడియం, ఎంపీడీవో నూతన కార్యాలయ భవనాలను ఎంపీ రంజిత్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి ఎమ్మెల్యే కాలె యాదయ్యలతో కలిసి మంత్రి మహేందర్రెడ్డి ప్రారంభించారు. చేవెళ్లలోని షాబాద్ చౌరస్తా నుంచి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఢిల్లీ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఎన్నికలప్పుడే ఆ పార్టీల నాయకులకు ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయన్నారు. వందేండ్ల ప్రగతిని పదేండ్లలో చూపిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. రాష్ర్టాభివృద్ధి సీఎంతోనే సాధ్యమని.. జరిగిన ప్రగతిని గుర్తించి బీఆర్ఎస్ పార్టీని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు.
కందుకూరు, అక్టోబర్ 8 : ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోవద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి కోరారు. ఆదివారం ఉదయం మండల పరిధిలోని సార్లరావులపల్లితండాలో రూ.2.50 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవనం, ఫంక్షన్ హాల్లను సర్పంచ్ రజితతో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే 3 గంటల విద్యుత్ ఇస్తానని చెపుతుండు.. మీకు 3 గంటలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా, లేక 24 గంటలు ఉచితంగా ఇచ్చే సీఎం కేసీఆర్ ప్రభుత్వం కావాలా అని ప్రజలను ప్రశ్నించారు. గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రూ.200 ఇచ్చిన పింఛన్ను సీఎం కేసీఆర్ రూ.2,116 చేశారని చెప్పారు.
కరెంట్, తాగునీరు, ఎరువులు, అభివృద్ధి సంక్షేమ పథకాలను అనుభవిస్తున్న మనం.. తప్పిపోయి కాంగ్రెస్ చేతుల్లోకి పోతే ఆగమాగం కావాల్సి వస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్పై ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉందని చెప్పారు. వందేండ్ల ప్రగతిని సీఎం కేసీఆర్ 10 ఏండ్లలో చేసి చూపించారని తెలిపారు. ఢిల్లీ పార్టీలు మన రాష్ర్టానికి అవసరమా అని ప్రశ్నించారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ మరింత అభివృద్ధి చెందేదుకు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్రం సీఎం కేసీఆర్ అడ్డా అని.. ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని మంత్రి కోరారు.
అన్ని రంగాల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను కల్పించినట్లు మంత్రి చెప్పారు. గిరిజనుల ఆత్మ గౌరవం కోసం బంజారాహిల్స్లో గిరిజనుల భవనం నిర్మించినట్లు ఆమె తెలిపారు. సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని అధికారంలోకి రాగానే వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. 500 జనాభా ఉన్న ప్రతి తండాను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగుతున్నట్లు తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ జంగారెడ్డి, ఎంపీపీ జ్యోతి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి, వైస్ ఎంపీపీ శమంత, సర్పంచ్ రజిత, మాజీ సర్పంచ్లు గోవర్ధన్నాయక్, నర్సింహ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథముదిరాజ్, సాయిలు, రాజశేఖర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు జయేందర్ ముదిరాజ్, రైతు విభాగం మండల అధ్యక్షుడు అమరేందర్రెడ్డి, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్తీక్, సోషల్ మీడియా కన్వీనర్ దీక్షిత్రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు ఎంపీటీసీలు ఇందిరమ్మ, రాములు, మల్లేశ్, మాజీ సర్పంచ్ గోవర్ధన్నాయక్, యూత్ నాయకుడు కార్తీక్, సర్పంచ్లు ఉన్నారు.
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి సబితారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ మహిళలకు బతుకమ్మ చీరలను కానుకగా అందజేస్తున్నట్లు చెప్పారు. మండల పరిధిలోని సార్లరావులపల్లితండాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలకు బతుకమ్మ చీరలను ఇవ్వడంతో పాటు నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ మహిళలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నట్లు వివరించారు. మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని మంత్రి చెప్పారు.