గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై గురువారం రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జనం రోడ్డెక్కి ఆందోళనల్లో పాల్గొన్నారు. ‘ధరల దాడితో చంపకు మోదీ..’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. మీర్పేటలో జరిగిన నిరసన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, శేరిలింగంపల్లిలో ఎంపీ రంజిత్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలతో ప్రజల జేబులు నింపుతుంటే.. ప్రధాని మోదీ ఎడాపెడా ధరలు పెంచుతూ ప్రజల జేబులను గుల్ల్ల చేస్తున్నారని ధ్వజమెత్తారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేస్తే కట్టెల పొయ్యే దిక్కయితదని ప్రజలు గమనించాలన్నారు. జనాన్ని కష్టాల పాలు చేస్తున్న బీజేపీ పతనం వంటింటి నుంచే మొదలైందని.. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మోదీ సర్కార్ను గద్దె దింపి మహిళల శక్తి ఏంటో చూపించాలని పిలుపునిచ్పారు.
-రంగారెడ్డి, మార్చి 2 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : కట్టెల పొయ్యిని వదిలి గ్యాస్ బండలకు అలవాటుపడిన సామాన్యుల బతుకులతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటున్నది. 2014లో రూ.410 ఉన్న గ్యాస్ బండ ధర ఇప్పుడు రూ.1,155 ఉంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో చిన్నాభిన్నమవుతున్న ప్రజలకు గ్యాస్ ధర పెంపు గుదిబండగా తయారైంది. గ్యాస్ బండపై ఆధారపడిన వాళ్లంతా తిరిగి పూర్వపు కట్టెల పొయ్యి వైపు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సామాన్యులు రోడ్లమీదకొచ్చి పలు ప్రధాన కూడళ్లలో గ్యాస్ ధరలపై పెంపుపై పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ఆడుతున్న రాక్షస క్రీడతో సామాన్యుల బతుకులు భారంగా మారాయని బాధిత జనం గురువారం రోడ్ల పైకి వచ్చి ‘బీజేపీ డౌన్ డౌన్, పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి, మోదీ సర్కార్ ముర్దాబాద్’ అంటూ ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు.
జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు
జిల్లాలో మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలో మీర్పేట, బడంగ్పేట, జిల్లెలగూడ తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పలు కూడళ్లలో మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీఆర్ఎస్ పార్టీ స్థానిక అధ్యక్షుడు కామేశ్రెడ్డి ఆధ్వర్యంలో నేతలు, అభిమానులు వందలాదిగా పాల్గొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాంధీ ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పాల్గొని పెరిగిన గ్యాస్ ధరలకు నిరసన వ్యక్తం చేశారు. పాదయాత్ర చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది నిరసనలో పాల్గొనగా.. ఎల్బీనగర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారురు. చేవెళ్ల నియోజకవర్గంలో సీపీఐ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు, ప్లకార్డులతో ‘కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలి’ అంటూ నినదించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వందలాది విద్యార్థి నాయకులు, పెద్దఅంబర్పేటలో సీపీఐ నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
బీజేపీ పాలనకు చరమగీతం పాడుదాం : ఎంపీ రంజిత్రెడ్డి
చాలీచాలని జీతాలతో బతుకుతున్న పేదలకు గ్యాస్, పెట్రో ధరల బాదుడు ఆందోళన కలిగిస్తున్నది. మాది పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న బీజేపీకి ఇది సిగ్గు చేటు. పేదల కడుపు కొట్టి పెద్దల కొమ్ముకాస్తున్న బీజేపీ పాలనకు చరమగీతం పాడుదాం. బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేశంలో ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు. సబ్బండ వర్గాలు ఈ విషయాల్ని గుర్తుంచుకోవాలి.