వికారాబాద్, మార్చి 29 : జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన, ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్మీడియట్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించినందుకు అధికారులకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్షలో గతంలో ఉన్న 11 పేపర్లను ప్రస్తుతం 6 పేపర్లుగా కుదించామని.. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని వివరించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తప్పనిసరిగా ఏఎన్ఎం అందుబాటులో ఉండాలన్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు రవాణా కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఉదయం, మధ్యాహ్నం నడపాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ.. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు జరుగుతాయన్నారు. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు, సైన్స్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు జరుగుతాయని తెలిపారు. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్షలు 74 కేంద్రాల్లో నిర్వహించనున్నామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం, ఏఎన్ఎం, ఆశావర్కర్లతోపాటు మందులను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్ అనుమతించకూడదని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, డీఈవో రేణుకాదేవి, డీఎంహెచ్వో పాల్వన్కుమార్, అడిషనల్ ఎస్పీ మురళీధర్, విద్యుత్ శాఖ ఎస్ఈ దేవరాజు, ఆర్టీసీ, పోస్టల్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఏర్పాట్లు చేయాలి
ఇబ్రహీంపట్నం : పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్నదని, వారు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహకం, మోటివేషన్ అందించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. వేసవి కాలంలో పరీక్షలు నిర్వహిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులకు హాల్ టికెట్లను వెబ్సైట్ bse.telangana.gov.inలో అందుబాటులో ఉంచామని, విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు.
విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ.. పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
‘పది’లో 226 పరీక్ష కేంద్రాలు
జిల్లాలో 226 పరీక్ష కేంద్రాల ద్వారా 49,574 మంది రెగ్యులర్ విద్యార్థులు, 729 మంది సప్లిమెంటరీ విద్యార్థులకు పరీక్షలకు హాజరుకానున్నారని కలెక్టర్ హరీశ్ తెలిపారు. 34 ప్రశ్నాపత్రాల స్టోరేజీ పాయింట్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇప్పటికే సంబంధిత అధికారులకు కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించి, అవసరమైన సూచనలు చేశామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ.. పోలీసు బందోబస్తుకు ఆదేశించామన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రాథమిక చికిత్స కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు ఏర్పాటుచేసి ఒక ఏఎన్ఎం అందుబాటులో ఉండేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించినట్టు పేర్కొన్నారు. సమావేశంలో విద్యాశాఖ అధికారి సుశీందర్రావు, వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్రావు ఉన్నారు.